అనంతపురం: వైఎస్లో ఉన్న మంచి లక్షణాలు జగన్లో లేవని టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్రెడ్డి అన్నారు. బుధవారం అనంతపురం జిల్లా టీడీపీ సమీక్ష సమావేశంలో చంద్రబాబు ముందే జేసీ దివాకర్రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, వైఎస్లో ఉన్న మంచి లక్షణాలు జగన్లో పది శాతం కూడా లేవని అన్నారు. జగన్ మరో రాజారెడ్డి లాంటివాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబులో మార్పు రావాలన్నారు. ఎప్పుడూ శాంతి వచనాలు, శాంతి వచనాలు అంటూ మమ్మల్ని చంకనాకించావ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రెండున్నరేళ్లలోనే ఎన్నికలు వస్తాయని జేసీ వ్యాఖ్యానించారు. పోలీసులు వైసీపీ నేతలకు వంగి వంగి దండాలు పెడుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక, తమ బూట్లు నాకే పోలీసులను తెచ్చుకుంటామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన వారిని గుర్తు పెట్టుకుంటామన్నారు. టీడీపీ కార్యకర్తల్ని బెదిరించిన వారిపై కేసులు పెట్టిస్తామని.. సారా, గంజాయి కేసులు పెట్టిస్తామని చెప్పారు. ఎన్నికలకు ముందు పార్టీలో కొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దని చెప్పానని.. కానీ చంద్రబాబు తన మాట వినలేదన్నారు. చంద్రబాబును అందరూ మోసం చేస్తున్నారని.. చప్పట్లు కొట్టే వాళ్లను పట్టించుకోవద్దని హితవు పలికారు.