నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది పూర్వకాలం నుంచీ తెలిసిన విషయమే. ఈ నానుడి రాజకీయాల్లో కొందరు లౌక్యంగా నడుచుకునేలే చేస్తే.. మరికొందరికి తమ పదవి, హోదా దీనిన కప్పేస్తుంది. బలం, బలగం, బలుపు చూసుకుని నోటికి పని చేప్తారు. ఈ తరహా నాయకులు రాష్ట్రంలోని రెండు పెద్ద పార్టీలైన వైసీపీ, టీడీపీల్లో ఉన్నారు. వీరిలో ముందువరుసలో వచ్చే పేర్లు.. టీడీపీలో జేసీ సోదరులు, చింతమనేని.. వైసీపీలో మంత్రులు కొడాలి నాని, రోజా.. ఇలా ఈ లిస్టు పెద్దదే ఉంది. వీరిలో జేసీ ప్రభాకర రెడ్డి గురించి చెప్పాల్సి వస్తే.. 54 రోజులపాటు జైలులో ఉండి ఈ గురువారం బెయిల్ పై విడుదలయ్యారు. అయితే.. తనదైన ప్రవర్తనతో మళ్లీ జైలుకెళ్లే పరిస్థితులు కొని తెచ్చుకున్నారు.
అసందర్భంగా.. అనవసరంగా పోలీసులపై చిందులు..
నిన్న బెయిల్ పై విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డికి స్వాగతం పలికేందుకు ఆయన వర్గీయులు, పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. నిజానికి కోవిడ్ నేపథ్యంలో ఇటువంటి ర్యాలీలకు అనుమతి లేదు కూడా. కానీ.. వారికున్న బలగం వీటి గురించి ఆలోచించలేదు. దీంతో వీరు ర్యాలీ చేపట్టారు. అయితే.. విధి నిర్వహణలో భాగంగా ప్రశ్నించిన ఓ పోలీసు అధికారిని బెదిరించారు జేసీ. దీంతో పోలీసులు ఆయనపై సెక్షన్ 353, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ రెండూ పెద్ద కేసులే. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కావడంతో మళ్లీ ఈరోజు కానీ.. రేపు కానీ అరెస్టయ్యే అవకాశాలున్నాయి.
ఇప్పటికే జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డితో కలసి జైలులో ఉండి వచ్చారు. వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బెయిల్ పై విడుదలైనప్పుడు ఉండాల్సిన సహనం, శాంతి ఆయనలో కొరవడ్డాయి. దీంతో మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ‘క్రమశిక్షణ ఉన్న పార్టీ టీడీపీ’ అని చెప్పుకునే ఆ పార్టీ నాయకులకు జేసీ ప్రవర్తనకు ఏం సమాధానం చెప్తారని విమర్శలు వస్తున్నాయి.