విజయవాడ, మార్చి 23: చంద్రబాబు, జగన్, పవన్ పార్టీలకు ఓటు వేయవద్దు, వారు ముగ్గురు ఎక్కి తిరిగే హెలికాఫ్టర్కే ప్రజలు ఓటు వేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన ప్రజాశాంతి పార్టీ అభ్యర్థులకు బిఫాంలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన దైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసిపి నేత జగన్లపై విమర్శలు చేశారు.
తాము నీతి, నిజాయితీకి నిదర్శనమని పాల్ పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి నియోజకవర్గంలో అత్యాధునిక హాస్పటల్ నిర్మిస్తామన్నారు. జర్నలిస్ట్ సంఘాలకు భవనాలతో పాటు జర్నలిస్ట్లందరికీ ఏడాది లోపు ట్రిపుల్ బెడ్ రూమ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు.
జర్నలిస్ట్లు ముందుకు వస్తే అభ్యర్థిత్వాలు ఖరారు చేస్తానని పాల్ అన్నారు. ప్రతి జిల్లాకు ఒక జర్నిలిస్ట్ పోటీ చేయాలని పాల్ కోరారు. ఇప్పటికే ఇద్దరు జర్నిలిస్ట్లకు బి ఫారంలు కూడా ఇచ్చిన్నట్లు తెలిపారు. పైసా తీసుకోకుండా జర్నిలిస్ట్ మిత్రులకు 13 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ సీట్లు కేటాయిస్తామని పాల్ అన్నారు.
ప్రజాశాంతి పార్టీ అందరి పార్టీ, అవినీతి లేని పార్టీ అన్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని అన్నారు. కావున స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన రెబల్స్ వస్తే ప్రజాశాంతి పార్టీ బీఫాంలు ఇస్తుందని పాల్ ప్రకటించారు.
25వ తేదీ నుండి హెలికాఫ్టర్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు పాల్ వెల్లడించారు.