బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్మినారాయణ, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిల మధ్య ఆరోపణల యుద్ధం సద్దుమణిగినట్లు లేదు. కరోనా నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం కొనుగోలు చేసిన టెస్టింగ్ కిట్ల వ్యవహారంపై కన్నా ఆరోపణలు చేయడం, కన్నా తెలుగుదేశం పార్టీకి అమ్ముడుపోయాడంటూ విజయసాయి రెడ్డి ప్రత్యారోపణలు తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. డిల్లీ పెద్దలు జోక్యం చేసుకోవడం వల్ల వారి మధ్య వివాదం సద్దుమణిగిందని అందరూ భావిస్తున్న తరుణంలో విజయసాయి రెడ్డిని ఇరికించేలా కన్నా లక్మినారాయణ మరో అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చారు.
108 అంబులెన్సుల నిర్వహణ కాంట్రాక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ ఐదేళ్ల కాలంలో దాదాపు వెయ్యి కోట్లు ప్రజా ధనాన్ని విజయసాయి రెడ్డి అల్లుడు స్వాహా చేసేలా జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని, దీనిపై విచారణ జరిపించాలని కన్నా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు.
108 అంబులెన్సు నిర్వహణ కాంట్రాక్టుకు విజయసాయి రెడ్డికి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? అసలు ఏమి జరిగిందో తెలుసుకోండి. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత గత టీడీపీ ప్రభుత్వం జరిగిన పలు ఒప్పందాలను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ తో కొత్త సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. అదే క్రమంలో బీఏజీ సంస్థకు ఉన్న 108 అంబులెన్సుల నిర్వహణ ఒప్పందాన్ని వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత రద్దు చేసింది. వెంటనే ఆ కాంట్రాక్టును అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు అప్పగించింది. అయితే రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రభుత్వానికి ఆదా అవుతుందని అనుకున్నారు. కానీ అరబిందో ఫార్మా ఫౌండేషన్ కు నెలకు 2.21లక్షలు చెల్లింపునకు అంగీకరించారు.అదే విధంగా కొత్తగా కొనుగోలు చేసే వాటికి లక్షా 78వేలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. గతంలో బీఏజీ సంస్థ అంబులెన్సు నిర్వహణకు నెలకు లక్షా 31వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకుంటే దాన్ని రద్దు చేసి 2.21 లక్షల చెల్లింపునకు ఒప్పందం చేసుకుందని కన్నా బయట పెట్టారు. అరబిందో రోహిత్ రెడ్డి స్వయానా విజయసాయి రెడ్డి అల్లుడు. ఈ కాంట్రాక్టులో విజయసాయి రెడ్డి, అయన అల్లుడు రోహిత్ రెడ్డి, అరబిందో చైర్మన్ రాంప్రసాద్ రెడ్డి పాత్ర తేల్చాలని కన్నా డిమాండ్ చేస్తున్నారు. కన్నా అంటే వంటి కాలిపై లేచే విజయసాయి రెడ్డి ఇంత వరకు అయన ఆరోపణలపై స్పందించలేదు. ఈ వ్యవహారంపై ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?