గుంటూరు: మూడు రాజధానుల ప్రతిపాదనపై సీఎం జగన్ తన వైఖరి మార్చుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. మంగళవారం రాజధాని ప్రాంత రైతులు గుంటూరులో కన్నాను కలిశారు. ఈ సందర్భంగా కన్నా మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతుందా? అని ప్రశ్నించారు. రాజధాని మారుతుందని చెప్పి రైతులను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారినప్పుడల్లా విధానాలు మారుస్తామనడం మంచిది కాదని అన్నారు. కక్ష సాధింపు చర్యలతో ముందుకెళ్తే భవిష్యత్తులో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరించారు. జగన్ వైఖరిలో కక్ష సాధింపు ధోరణి కనపడుతోందని విమర్శించారు. రాజధానిపై గందరగోళ ప్రకటనలు చేయడం మంచి పద్ధతి కాదని తెలిపారు. ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతూ వచ్చి మోసం చేస్తారా? అంటూ మండిపడ్డారు. నియంతృత్వ ధోరణి ఎవరికైనా మంచిది కాదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా లేరని, ప్రభుత్వ నిర్ణయాలు లక్షల మంది జీవితాలపై ప్రభావం చూపిస్తున్నాయని కన్నా చెప్పారు. భయంతో బతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. ఇది రైతుల సమస్య కాదని.. రాజధాని సమస్య అని అన్నారు. కేంద్రం హెచ్చరించినా జగన్ నియంతృత్వ ధోరణితో వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.
previous post