ఏలూరు: పోలవరంలో అవినీతి ఎక్కడ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కనిపెట్టలేకపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ అన్నారు. ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పనులను శుక్రవారం ఏపీ బీజేపీ నేతలు సందర్శించనున్నారు. ప్రాజెక్టుకు బయల్దేరి వెళ్లేముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు పూర్తవుతోందని… ఈ నేపథ్యంలో, పోలవరం పనులు ఎంత వరకు వచ్చాయో చూద్దామని అక్కడకు వెళ్తున్నామని తెలిపారు. పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ ప్రభుత్వం… ఆ అవినీతిని నిరూపించి రివర్స్ టెండరింగ్ కు వెళ్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయిన తర్వాత పోలవరం ముంపు ప్రాంతాలను ఏపీలో కలిపారని చెప్పారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం వంద శాతం నిధులను ఇస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గత టీడీపీ ప్రభుత్వం ఒక పర్యాటక ప్రాతంగానే చూసిందని… సీరియస్ గా పని పూర్తి చేయాలని అనుకోలేదని కన్నా విమర్శించారు. ఈనెల 13న కేంద్ర జల వనరుల శాఖ మంత్రిని కలిసి ఒక నివేదిక అందజేస్తామని చెప్పారు. పోలవరం పురోగతి, అవినీతి ఆరోపణలపై వివరిస్తామన్నారు. పోలవరంలో అవినీతి జరింగిందని ఆరోపిస్తూ, కావాల్సిన పనులను ముఖ్యమంత్రి జగన్ చేయించుకుంటున్నారని దుయ్యబట్టారు. పోలవరం త్వరగా పూర్తి కావాలనేదే బీజేపీ సంకల్పమని కన్నా స్పష్టం చేశారు.
ఇటీవలే పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందంటూ ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రాజెక్ట్ అంచనా వ్యయాన్ని రూ.16 వేల కోట్ల నుంచి రూ.58 వేల కోట్లకు పెంచారని, టెండర్ నామినేషన్ల పద్దతిలో వేల కోట్ల రూపాయల పనులు అప్పగిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై బుధవారం విచారణ జరిపిన న్యాయస్థానం.. పోలవరంపై విచారణ జరపాలని కేంద్ర జలశక్తి శాఖను సూచించింది. పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్ను ఫిర్యాదుగా భావించాలని తెలిపిన సంగతి తెలిసిందే.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?