అమరావతి: చేతిలో అధికారం ఉందని విర్రవీగొద్దని, ఏపీ శాసన మండలి రద్దు నిర్ణయం సీఎం జగన్ సహజ ధోరణికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీకి 151 సీట్లు వచ్చాయని విర్రవీగితే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. అసెంబ్లీ నిర్ణయాల్లో లోపాలు ఉంటే సెలెక్ట్ కమిటీకి పంపడం సాధారణ ప్రక్రియని ఆయన చెప్పారు. ‘మండలికి ఖర్చు వృథా అయితే మీ ప్రచారాల కోసం చేస్తోన్న ఖర్చులు వృథా కాదా?’ అని జగన్ను కన్నా ప్రశ్నించారు. పార్టీ కార్యకర్తలకు వాలంటీర్ల పేరుతో ఇచ్చే జీతాల సంగతేంటీ? అని నిలదీశారు. బిల్లుల విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై మండలిలో బీజేపీ సభ్యులు కూడా నిరసన తెలిపారని, ఆ మాత్రానికే మండలి రద్దు నిర్ణయం తీసుకుంటారా? అంటూ కన్నా మండిపడ్డారు.
కాగా, ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి సోమవారం(జనవరి 27) అసెంబ్లీ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ సభలో మండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టి చర్చ నిర్వహించారు. ప్రజాప్రయోజనం లేని మండలిపై డబ్బు ఖర్చు చేయడం దండగని తెలిపారు. మండలి నిర్వహణ కోసం ఏడాదికి రూ.60 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. మొత్తం 133 మంది మండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారు.