గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రివ్యూలలో కలెక్టర్లను పొగడటం అనుమానాలకు తావిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో మంగళవారం కన్నా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు సంబంధించిన కలెక్టర్లను పెట్టుకుని ఎన్నికలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. దానిని ఎదుటివారిపై రుద్దుతున్నారని మండిపడ్డారు. ఈవిఎంలపై చంద్రబాబు పదే పదే వ్యాఖ్యలు చేయటం కూడా పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.
నిత్యం అబద్ధాలాడే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటని కన్నా విమర్శించారు. మొన్నటి ఎన్నికల్లో రాష్ట్రంలో మద్యం, డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేశారని ఆయన ఆరోపించారు. దీనిపై విచారణ జరపాలని ఎన్నికల అధికారిని కోరితే ఇంతవరకూ స్పందించలేదని తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని కన్నా అన్నారు. ఇలాంటి ఎన్నికలు ఇంత వరకు ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశానన్న ఎంపి జేసి దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోరా? అని కన్నా ప్రశ్నించారు.