(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
చంద్రబాబు సమకాలీకుడు…!
ప్రకాశం జిల్లాలో టీడీపీకి వెన్నుదన్ను…!
ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నేత…! ఈ లక్షణాలున్న కరణం బలరాం పార్టీ మారారు. అంటే సాంకేతికంగా కాదు లెండి, నైతికంగా మారిపోయినట్టే. ఆయన కుమారుడు వెంకటేష్ వైసీపీ కండువా వేసేసుకోగా…, బలరాం మాత్రం జగన్ కి పుష్పగుచ్ఛం ఇచ్చి, ఫోటోకి పోజులిచ్చారు అంతే. అంటే వల్లభనేని వంశీ, మద్దల గిరిధర్ లాగానే కరణం కూడా టీడీపీ జెండా నుండి గెలిచి, టీడీపీని వీడినట్టే. సాంకేతికంగా ఇబ్బందులు రాకుండా ఉండేందుకు, అధికారికంగా జగన్ పార్టీ కండువా వేసుకోలేదు అంతే. ఆయన చేరారు సరే. ఈ డెబ్భై ఏళ్ల వయసులో ఆయన ఎందుకు మరాల్సి వచ్చింది? టిడిపి తరపున చీరాల నుండి పోటీలో దిగి గెలిచి, చంద్రబాబుతో అంతా బాగుంది అనుకున్న తరుణంలో ఆయన ఎందుకు పార్టీ మారారు…? వెనుక కారణాలు, చీరాల, అద్దంకిలో ఆయన క్యాడేర్ పరిస్థితులు ఒక్కసారి చూసొద్దాం..!
కరణం బలరాం టీడీపీని వీడడం ఏమంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. ఆయన టీడీపీకి కంకనబద్ధుడిగా ఏమి ఉండలేదు. అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ ని పార్టీలో చేర్చుకోవడం నచ్చక నాలుగేళ్ళ కిందటి నుండి టీడీపీపైనా, చంద్రబాబుపైనా అలిగే ఉన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి బాబుపై, టీడీపీపై విసుర్లు, విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక 2019 ఎన్నికల నాటికి పార్టీని ఆయన, ఆయనను పార్టీ బాగానే వాడుకున్నారు. చీరాలలో పోటీకి గెలిచే సత్తా ఉన్న నాయకుల అన్వేషణలో ఉన్న టీడీపీకి కరణం సరైన అభ్యర్థిగా కనిపించారు. పలు షరతులతో ఆయన పోటీ చేశారు, గెలిచారు. జిల్లాలో, ఒకరకంగా రాష్ట్రంలో పార్టీ నుండి ఆర్ధిక దన్ను ఎక్కువగా అందుకున్న అభ్యర్థి ఈయనే. ఈయనను గెలిపించడానికి టిడిపి క్యాడేర్, చంద్రబాబు సహా అనేకమంది నాయకులు వ్యూహాత్మక వలలు వేసి గెలిపించారు. ఎన్నికల్లో టిడిపి గెలిచి ఉంటే కరణంకి మంత్రి పదవి కచ్చితంగా దక్కేది. ఆ విషయాలు పక్కన పెట్టి…, తాజాగా ఆయన ఎందుకు పార్టీ మారారు అనేది పరిశీలిస్తే….
చీరాల, అద్దంకి రెండూ రాజకీయ చైతన్యం ఉన్న నియోజకవర్గాలే. రెండు చోట్లా కరణం బలరాంకి కొంత, సొంత బలగం ఉంది. కానీ రెండు చోట్లా ఆయనకు తగిన ప్రాబల్యం, పెత్తనం లేదు. అద్దంకిలో గొట్టిపాటి రవి ఎమ్మెల్యేగా ఉన్నారు. జనంలో బలమైన నాయకుడిగా స్థిరపడ్డారు. చీరాలలో కరణం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అక్కడ వైసిపి ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బలంగా ఉన్నారు. జనంలో, శ్రేణుల్లో పలుకుబడి కలిగిన నేతగా స్థిరపడ్డారు. అంటే… ఈ రెండు చోట్లా కరణం పరిస్థితి ద్వితీయమే. పార్టీలోనూ ఈ దఫా ప్రతిపక్షంలో ఉంటూ ఆయన చేసేదేం లేదు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ఈయనకు చేసిందేం లేదు. ఇక కుమారుడి భవిష్యత్ ఏమిటో అర్థం కాని పరిస్థితి ఉంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ పెత్తనం లేక…, రెండు చోట్లా నామమాత్రంగా పరిమితమవ్వడం, కుమారుడి భవిష్యత్ పై ఒకింత ఆందోళనతో కరణం బలరాం ఈ నిర్ణయం తీసుకున్నారని అనుకుంటున్నారు. కానీ… వీరికి వైసీపీ ఇచ్చిన హామీ ఏంటి? ఈ రెండు చోట్లా వీరి పరిస్థితి ఏంటి అనేది కాస్త చూద్దాం…!
పార్టీకి కరణం అడిగింది ఎక్కువే..! అద్దంకిలో ఇన్చార్జిగా బాధ్యతలు.., చీరాలలో పూర్తి పెత్తనాలు అడిగారని వైసీపీ అంతర్గత వర్గాల సమాచారం. కుమారుడు వెంకటేష్ కి అద్దంకి బాధ్యతలు అప్పగించేసి, చీరాలలో తాను ఈ దఫా ఉండాలని భావించారు. కానీ వీటిపై జగన్ నుండి స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తుంది. అద్దంకిలో ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న బాచిన కృష్ణ చైతన్యపై ఉన్న వ్యతిరేకత కారణంగా వెంకటేష్ కి అద్దంకి బాధ్యతలు అప్పగించడానికి సిద్ధమయ్యారు. కానీ చీరాల విషయమే పెండింగ్ పెట్టినట్టు సమాచారం. అక్కడ ఆమంచి బలంగా, స్థిరంగా ఉండడంతో వైసీపీలో ప్రస్తుతం మార్పులు మంచిది కాదని భావిస్తున్నారు. అయితే కొద్దిరోజులు ఆమంచి, కరణం కలిసి పనిచేయాలని పార్టీ అదేశించే వీలుంది అని అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కరణం పార్టీ మార్పు కారణం మాత్రం వ్యక్తిగతమే తప్ప… పెద్ద రాజకీయ ప్రకంపన మాత్రం కాబోదు.