రాజకీయాల్లో… ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం . ఎవరికి ఎవరు ఎప్పుడు శత్రువులు/ మిత్రులు అవుతారో అంచనా వేయడం కష్టమే. అదే సమయంలో కొన్ని విమర్శలు సైతం చిత్రంగా ఉంటుంటాయి. ఇలాంటి చిత్రమైన విమర్శ ఒకటి తాజాగా తెరమీదకు వచ్చింది.
రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. గత 17 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. రైతు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, రద్దు మినహా సవరణలు చేసినా ఒప్పుకోబోమని అన్నారు. అయితే.. రైతుల డిమాండ్లపై కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమంపై సీపీఐ నేత నారాయణ స్పందించారు.
ఢిల్లీ ఆందోళనలపై ఏమంటున్నారంటే…
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా మీడియాతో మాట్లాడుతూ రైతులు అందరూ పార్టీలతో సంబంధం లేకుండా కలిసి కట్టుగా ఉద్యమం చేస్తున్నారని తెలిపారు. కేంద్రం మాత్రం రైతులను అవమానపరిచేలా వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. రైతులకు తమ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై ఆయన మాట్లాడారు. ఎప్పట్లాగే తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
కేసీఆర్ , జగన్ కు ఏం లింక్ అంటే..
తెలుగు రాష్ట్రాల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీలు నడుస్తున్నాయని సీపీఐ నేత నారాయణ కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రధాని మోడీ కనుసన్నల్లో బతుకుతున్నారని నారాయణ పేర్కొన్నారు. ఏపీలో బీజేపీ, వైసీపీ మరియు తెలుగు దేశం పార్టీల మధ్య ప్రేమాయణం నడుస్తుందని చురకలు అంటించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, టీఆర్ఎస్ మరియు ఎంఐఎం పార్టీల మధ్య ప్రేమాయణం నడుస్తుందని నారాయణ అన్నారు. కమ్యూనిస్టు పార్టీ నేత కామెంట్లపై ఏపీలోని అధికార వైసీపీ , తెలంగాణలోని పాలకపక్షమైన టీఆర్ఎస్ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.