**ఒకపక్క జమిలి ఎన్నికలు అంటూ 2022 లోనే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… మరోపక్క మోడీ సైతం దీనికి సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో… కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం తాము దీనికి సిద్ధమని ప్రకటిస్తున్న తరుణంలో… తెలంగాణ రాజకీయాలు ఎంతో వేగంగా మారుతున్నాయి. ఇటీవల దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బ పడిన అధికార పార్టీ తెరాస కొత్త ఆలోచనలతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు…
కేటీఆర్ ముఖ్యమంత్రి?
**ఇప్పుడు తెలంగాణ అంతటా మారుమోగుతున్న పేరు కేటీఆర్. కెసిఆర్ రాజకీయ వారసుడిగా వెలుగొందుతున్న ఆయన త్వరలోనే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని టిఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం ఊపందుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని కొడుకు కేటీఆర్ కు అప్పగించి… కెసిఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి ఇప్పటికి ముహూర్తం ఫిక్స్ చేశారని కొత్త సంవత్సరంలో కేటీఆర్కు ఈ బాధ్యతలు వెంటనే అప్పగించి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం అధికార పార్టీ టిఆర్ఎస్ లోనే ఎక్కువ అయ్యింది. దాదాపుగా వచ్చే సంవత్సరం మొదట్లోనే కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన అవకాశాలు ఉన్నాయని టిఆర్ఎస్ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. మరోపక్క కేసీఆర్ మేనల్లుడు, మాస్ లీడర్ గా క్షణములు పేరున్న హరీష్ రావును పార్టీ కోసం వినియోగించుకోవాలని కెసిఆర్ ప్లాన్ చేస్తున్నాడు. పాలలో కొడుకుని పెట్టి పార్టీ విషయంలో మేనల్లుడికి పగ్గాలు అప్పగించే ఆయన రెండు వైపులా పదునైన కత్తిని తయారు చేసే పనిలో పడ్డారు. ఇలా అయితేనే టీఆర్ఎస్కు తెలంగాణలో తిరుగుండదని మాస్లో మంచి ఇమేజ్ వున్న హరీష్ రావు పార్టీ పగ్గాలు అందుకుంటే పార్టీ మరింత జోరుగా ముందుకు వెళ్తుందని కెసిఆర్ ఓ అంచనాకు వచ్చారు. దీనిపై ఇప్పటికే కెసిఆర్ టిఆర్ఎస్ లోని ప్రధాన నాయకులతో చర్చలు జరిపారని జాతీయ రాజకీయాలకు వెళ్ళే సమయం ఇదేనని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు ఎందుకు??
**2002 జమిలి ఎన్నికలు రావడం దాదాపు ఖాయమనే సంకేతాలు అన్నివైపుల నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపియేతర పార్టీలు అన్నిటిని ఒక తాటి పైకి తీసుకు వస్తేనే.. మోడీ ను అమిత్ షా ను ఎదుర్కోవడం అవుతుంది. ఈ బాధ్యతను ఇప్పుడు కెసిఆర్ తీసుకోవాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభావం దేశవ్యాప్తంగా తగ్గుతున్న సమయంలో.. బిజెపి కాంగ్రెస్ నేత పక్షాలను ఒక్కటి చేస్తే.. అందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తే కాంగ్రెస్ కచ్చితంగా అన్ని పార్టీల మాట వినక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. అవసరమైతే కాంగ్రెస్ మద్దతు తీసుకుని కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అయితే మొదట కాంగ్రెస్ బిజెపియేతర పక్షాలను కలపడం పెద్ద పని. దీనికి ఇప్పుడు కేసీఆర్ చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. సమకాలీన రాజకీయ అంశాలపై పట్టుతో పాటు భాషపై మంచి గ్రిప్ ఉన్న కేసీఆర్ అన్ని రాష్ట్రాల పార్టీల నాయకులతో మాట్లాడే అవకాశం ఉంది.
** ప్రస్తుతం ఢిల్లీ కేంద్రంగా రైతు ఉద్యమం భారీగా నడుస్తోంది. అన్ని వైపుల నుంచి రైతులకు మద్దతు లభిస్తుంది. ఈ సమయంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు వెళ్లి రైతు ఉద్యమాన్ని అన్ని రాష్ట్రాలకు విస్తరించేలా ప్లాన్ చేసి బిజెపి వ్యతిరేకతను ప్రజల్లో పెంచేందుకు ఓ మార్గంగా ఈ సమయాన్ని భావిస్తున్నారు. దీంతో కొత్త సంవత్సరంలో తెలంగాణ రాజకీయాల్లో కొత్త మార్పులు చూడవచ్చు.