అటు తెలంగాణలో కెసిఆర్ ప్రభుత్వానికి, ఇటు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త తలనొప్పి ఎదురుకాబోతున్నది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోేపం అన్న చందంగా కొన్ని అంశాలు పాలకులకు ఇబ్బందులు కల్గిస్తుంటాయి. ఉప కులాలకు సంబంధించి సుప్రీం కోర్టు గురువారం తాజాగా వెల్లడించిన తీర్పు నేపథ్యంలో ఉప కులాల వర్గీకరణ అంశం ఈ రెండు ప్రభుత్వాలకు అగ్ని పరీక్ష పెట్టినట్లు అవుతోంది.
విషయంలోకి వెెళితే…ఎస్సీ, ఎస్టీ ఉప కులాలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆయా ఉప కులాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉప కులాల వర్గీకరణ విషయంలో స్వేచ్చ వచ్చినట్లు అయ్యింది. ఎస్సీ, ఎస్టీ ఉప కులాల వర్గీకరణపై పంజాబ్ నుండి దాఖలైన ఒక పిటిషన్ పై దేశ ఉన్నత న్యాయ స్థానం గురువారం విచారణ చేపట్టింది. ఎస్సీ, ఎస్టీ కులాల ఉప వర్గీకరణకు పంజాబ్ ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు అప్పట్లో కొట్టివేసింది. 2004లో ఈవిీ చిన్నయ్య వర్సెస్ ఏపి ప్రభుత్వం కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఆనాడు పంజాబ్ హైకోర్టు దాన్ని కొట్టి వేసింది. దీన్ని సవాల్ చేస్తూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు గడప తొక్కడంతో జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ కృష్ణ మురళీతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ పై విచారణ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేసింది. దీనిపై విచారణను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది,
ఎస్సీ, ఎస్టీల్లో కులాల వారీగా ఉప వర్గీకరణ చేపట్టాల్సిన పరిస్థితులు ఏదురైతే ఎక్కడా ప్రాధాన్యత తగ్గకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. ప్రాధాన్యత తగ్గించకుండా కులాల ఉప వర్గీకరణ చట్టం చేసుకోవచ్చని తెలిపింది. గతంలో ఈవీ చెన్నయ్య వర్సెస్ ఎపి ప్రభుత్వం కేసులో 2004లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో తాము విభేదిస్తున్నామనీ, ఆ తీర్పును పునః సమీక్షించాల్సిన అవసరం ఏర్పడిందనీ ధర్మాసనం పేర్కొనడం సంచలనంగా మారింది. 2004లో నాటి ధర్మాసనం సరైన నిర్ణయం తీసుకోకుండా తీర్పు ఇచ్చినట్లు అభిప్రాయపడింది ఈ ధర్మాసనం.
కాగా ఎంఆర్ పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం దశాబ్దాల నుండి నడుస్తున్నది. వర్గీకరణ అంశం చాలా సున్నితమైంది. ఎస్ సి వర్గీకరణ చేస్తే మాలలను దూరం చేసుకోవాల్సి వస్తుందని పాలక పార్టీల భయం. అందుకే దీనిపై ఇంత వరకూ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అదే విధంగా తెలంగాణలో ఆదివాసి, బంజారాల వివాదం ఉన్నది. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసీలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. కులాల వర్గీకరణ అంశంపై తాజాగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, వైఎస్ జగన్ ఎ విధంగా ముందుకు సాగుతారు అన్నది వేచి చూడాల్సిందే.