కేసీఆర్ అంటే ఒక విలక్షణత. అయన ఎవరికీ అర్థం కారు. ఆయనను ఎవరూ అర్ధం చేసుకోలేరు. మాటల గారడీ చేస్తుంటారు. రాజకీయ తంత్రాలు వేస్తుంటారు. పదిహేను రోజులు పాలన అంటే తెలియని సాధారణ వృత్తిలా ఉంటూ, మరో 15 రోజుల్లో మాయలుమర్మాలు చేసి ప్రజల మనసులు గెలుచుకుంటారు. తాజాగా కరోనా విషయంలోనూ అయన అదే బాట పాటిస్తున్నారు. ఆ మధ్య వేరీజ్ కేసీఆర్, కేసీఆర్ కనిపించడం లేదంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. ఆ తర్వాత ఫామ్ హౌస్ నుంచి వచ్చిన ఆయన గడిచిన పది రోజుల్లో విపరీతంగా బిజీగా గడుపుతూ తనదయిన మార్క్ తో దూసుకుపోతున్నారు. తాను కనిపించని రోజులను ప్రజలు మర్చిపోయెలా చేసుకుంటున్నారు. అందులో భాగంగానే కొంత మంది కొంత మంది కరోనా బాధితులతో కలసి బంతి భోజనంలో పాల్గొని తన ప్రత్యేకతను చాటుకున్నారు.
కొన్ని అంశాలలో స్థిరంగా, అత్యంత కఠినంగా వ్యవహరించే కేసీఆర్, అందులో కూడా మానవీయ కోణాన్ని ప్రదర్శిస్తారు. తమ దీర్ఘ కాలిక సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ మునుపెన్నడూ లేని విధంగా ఆర్టీసీ కార్మికులు 52 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేసినా తాను అనుకున్నదే కేసీఆర్ చేశారు. ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి విపక్షాలు మద్దతు తెలపడం, కోర్టు సైతం వారి సమస్యలను సానుభూతితో చూడాలని సూచించినా ఆర్టీసీ ఉద్యమాన్ని కేసీఆర్ ఏమాత్రం ఖాతరు చేయలేదు.
చివరకు యూనియన్ లను పక్కన పెట్టివస్తేనే తాను కార్మికుల డిమాండ్ ల పరిష్కరానికి చర్యలు తీసుకుంటానని చెప్పి వారు తన వద్దకు వచ్చేలా చేసుకున్నారు కేసీఆర్. జిల్లా, డిపోల వారీగా కార్మికులను తన ఇంటికి పిలిచి విందు ఇచ్చి వారి సమస్యలను సావధానంగా విని కొన్నింటికి హామీ ఇచ్చి వారి మనసును గెలుచుకున్నారు. ఆర్టీసీలో యూనియన్ లకు చెక్ పెట్టి దటీజ్ కేసీఆర్ అని అనిపించుకున్నారు.
ఇటీవల దేశ సరిహద్దులో, చైనా ముష్కరుల దాడి జరిపిన అమరుడైన సూర్యాపేటకు చెందిన, కల్నల్ సంతోష్ మృతదేహం హైదరాబాద్కు వచ్చిన సమయంలోనూ కేసీఆర్ తనదయిన స్టైల్ లోనే వ్యవహరించారు. అయితే గవర్నర్ తమిళసై ఎయిర్పోర్టుకు వెళ్లి మరీ సంతోష్ భౌతిక కాయానికి సెల్యూట్ చేసి నివాళులు అర్పించారు. ఈ సమయంలో అటువైపు కన్నెత్తి కూడా చూడని కేసీఆర్ తరువాత స్వయంగా సంతోష్ నివాసానికి వెళ్లి రెండు కోట్ల చెక్ ను అందజేయడంతో పాటు , సంతోష్బాబు భార్యకు కోరుకున్న ఉద్యోగం ఇస్తామనీ హామీ ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు బుధవారం సంతోష్ కుటుంబ సభ్యులను దాదాపు 20 మందిని తన ఇంటికి పిలిపించి, వారితో కలసి భోజనం చేశారు. సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ పోస్టింగ్, బంజరాహిల్స్ రోడ్ నెంబర్ 14లో.. 716 గజాల స్థలానికి సంబంధించిన పత్రాలను కేసీఆర్ అందజేసి దటీజ్ కేసీఆర్ అని అనిపించుకున్నారు.