గెలిచినా ఆనందం లేదు.. మేయర్ పీఠం తమదే అని తెలిసినా ఉత్సాహం లేదు.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది తామే అయినా నిర్వేదం.. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇది. నిజామాబాద్ ఎంపీ ఓటమి నుంచి నేర్చుకోని పాఠం దుబ్బాకలో టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బే కొట్టింది. ఏదో ఆశించి గ్రేటర్ ఎన్నికలకు ముందస్తుకు వెళ్లిన టీఆర్ఎస్ కు ఊహించని షాక్. ఏకులా వచ్చి మేకులా తయారైన బీజేపీ.. ఇప్పుడు టీఆర్ఎస్ కు ధీటుగా నిలబడింది. గత ఆరేళ్లలో తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీని నిర్వీర్యం చేసి ప్రతిపక్షమే లేకుండా చేసుకున్న కేసీఆర్ కు ఇప్పుడు బీజేపీని తప్పించడం కష్టమైన విషయం. ఎందుకంటే తెలంగాణలో బీజేపీ మొక్క దశలో లేదు.. చెట్టు అయి కూర్చుంది.
ప్రతిపక్షం విలువ తెలిసేలా..
ఇందుకు కారణం కేసీఆర్ స్వయంకృతాపరాదమే అని చెప్పాలి. కాంగ్రెస్, టీడీపీని లేకుండా చేయడం వల్లే బీజేపీ ఎదిగిందనేది వాస్తవం. ఎంతలేదన్నా హైదరాబాద్ లో టీడీపీకి ఓట్లు ఉన్నాయి. కానీ.. అవి టీఆర్ఎస్ కు కొంత, బీజేపీకి కొంత పడ్డాయి. ముఖ్యంగా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి వంటి ప్రాంతాల్లో టీడీపీ ఓట్లు టీఆర్ఎస్ కు పడినా.. ఎక్కువ టీడీపీ ఓట్లు బీజేపీకి వెళ్లడం వల్లే బీజేపీ ఆధిక్యత సాధించింది. టీడీపీ, కాంగ్రెస్ కూడా రేసులో ఉండుంటే టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు చీలి ఈ పార్టీలకు వడతాయి. కాబట్టి బీజేపికి ఈస్థాయి విజయం దక్కేది కాదు. కేసీఆర్ చేసిన ఈ తప్పు వల్ల ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న బీజేపీ ఎదగడంతోపాటు ప్రజల్లో బీజేపీ బలమైన పార్టీ అనే గుర్తింపు కూడా కేసీఆరే ఇచ్చినట్టైంది.
కేసీఆర్ చేసుకున్న తప్పిదమేనా..
2016లో కాంగ్రెస్ కు 3,48,388 ఓట్లు.. 10.40 శాతం రాగా, ప్రస్తుతం 2,24,528 ఓట్లు.. 6.67 శాతం ఓటింగ్ వచ్చింది. 2016లో టీడీపీకి 4,39,047 ఓట్లు.. 13.11 శాతం ఓటింగ్ రాగా, ప్రస్తుతం 55,662 ఓట్లు.. 1.66 శాతం ఓటింగ్ వచ్చింది. ఈ ఓట్లలో సింహభాగం బీజేపీకే పడ్డాయి. కాంగ్రెస్ డీలా పడటానికీ, టీడీపీ నిరాశావాదానికి కారణం కేసీఆర్. కాబట్టి.. ఇప్పటికి విడివిడిగా పోటీపడి.. ఎవరూ నెగ్గకపోవడం కంటే.. దూసుకొస్తున్న బీజేపీకి బలమిస్తే.. ముందు టీఆర్ఎస్ ను బలహీనం చేయొచ్చు. ప్రజల్లో ఇదే అభిప్రాయం కలిగిస్తే తర్వాతి ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఢీ కొట్టడం సులువు అవుతుంది. చలి చీమలన్నీ కలిసి బలమైన పామును చంపేసిన తరహాలోనే అన్ని పార్టీలు కలిసి టీఆర్ఎస్ ను దెబ్బ తీశాయని చెప్పాలి.