అమరావతి: కృష్ణాజిల్లాలో నవ్యాంధ్ర ప్రదేశ్కు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుగా ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఈ సారి ఎన్నిక ఫలితం ఉత్కంఠను రేపుతోంది. అక్కడ నుండి ప్రధాన పార్టీల్లో పాత ప్రత్యర్ధులే రంగంలో ఉన్నారు. బిజెపి, కాంగ్రెస్, జనసేన పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నప్పటికీ టిడిపి, వైసిపి మధ్యనే పోటీ నువ్వానేనా అన్న రీతిలో సాగింది. టిడిపి నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) మూడవ సారి గెలిచి హాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో కృషి చేశారు, వైసిపి నుండి బరిలో ఉన్న మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను 1994,99 ఎన్నికల్లో మాజీ మంత్రి నెట్టెం రఘురాంపై విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న జగ్గయ్యపేట నియోజకవర్గంలో మూడు సార్లు వరుసగా విజయం సాధించిన నెట్టెం రఘురాంపై సామినేని కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన ఉదయభాను వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ పార్టీని వీడి వైసిపిలో చేరారు.
రాష్ట్రంలో వైసిపి అధికారంలోకి రావడం, పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి తొలి మంత్రివర్గంలోనే సామినేని ఉదయభానును తీసుకోవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. 2009 ఎన్నికల్లో 9,678ఓట్ల తేడాతో పరాజయం పాలయిన సామినేని ఉదయభాను గత 2014 ఎన్నికల్లో కేవలం 1350ఓట్ల తేడాతో పరాజయం పాలైయ్యారు. తొలి సారి 6.53శాతం, తరువాత కేవలం 1.11శాతం ఓట్ల తేడాతోనే ఉదయభాను పరాజయం పాలవ్వడంతో ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు సర్వశక్తులూ ఒడ్డారు. ఇద్దరు అభ్యర్థులూ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలను నిర్వహించడంతో పాటు పోల్ మేనేజ్మెంట్లోనూ తగ్గకుండా కృషి చేశారని చెబుతున్నారు. ఇక్కడ నుండి గెలిచిన అభ్యర్థి మంత్రి అవ్వడం ఖాయమని ఆయా పార్టీల నేతలు ఘంటాపథంగా చెబుతున్నారు. రెండు పర్యాయాలుగా టిడిపికి చెందిన ఎమ్మెల్యేగా శ్రీరాం తాతయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నా గడచిన జగ్గయ్యపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉదయభాను నేతృత్వంలో వైసిపి సత్తా చాటింది. ఇరువురు నేతలు వ్యక్తిగతంగా బలమైన సామాజికపరమైన ఓట్లు కలిగి ఉన్నవారు కావడంతో పాటు వారికి పార్టీ ఓటింగ్ కలిసి వచ్చే అంశం. ఈ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితంపై సామాన్యులను ప్రశ్నిస్తే ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో బయటపడతారు అని పేర్కొంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సామినేని ఉదయభాను పదేళ్లు, శ్రీరాం తాతయ్య పదేళ్లు కృషి చేశారు. గడచిన రెండు ఎన్నికల్లోనూ ఉదయభాను పరాజయం పాలైనప్పటికీ పార్టీ క్యాడర్కు, ప్రజలకు, అభిమానులకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేశారని పేరుంది. అదే మాదిరిగా టిడిపి ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య ప్రభుత్వ సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు అందించడంతో పాటు ఆరోగ్య శ్రీ పథకం కింద అత్యధికుల వైద్య సహాయానికి నిధులు మంజూరు చేయించారన్న పేరు ఉంది. నువ్వానేనా అన్నరీతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రజల ఎవరిని ఆశీర్వదించారో తెలుసుకోవాలంటే ఈ నెల 23వ తేదీ వరకూ వేచి చూడాల్సి ఉంటుంది.