ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో నాల్గవ రోజైన గురువారం పలు కీలక బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. బిల్లులపై చర్చలో తమకు మాట్లాడే అవకాశ ఇవ్వలేదని టీడీపీ వాకౌట్ చేసింది. ముందుగా ఏపి విద్యుత్ సుంకం సవరణ (ఏపి ఎలక్ట్రిసిటీ డ్యూటీ అమెంట్మెంట్) బిల్లుపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారాం అంగీకరించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చను ప్రారంభించారు. మంత్రి ప్రసంగం అనంతరం బిల్లు సభ ఆమోదం పొందింది.
అనంతరం దిశ చట్టంపై చర్చ ప్రారంభమైంది. దిశ బిల్లుకు సవరణలు చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దిశ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తిప్పి పంపడంతో బిల్లులో అధికారులు సవరణలు చేశారు. సవరణ బిల్లుపై హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ మహిళలు, చిన్నారులపై జరిగే దాడుల నివారణకు దిశ చట్టాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశామనీ, విచారణ వేగవంతం కోసం డీఎస్పీ స్థాయి అధికారిని నియమించినట్లు చెప్పారు. తిరుపతి, మంగళగిరి, విశాఖపట్నంలో ఫారెన్సిక్ ల్యాబ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ధిశ చట్టానికి జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు వచ్చాయన్నారు. దిశ చట్టంతో బాదితులకు సత్వర న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దిశ చట్టం వచ్చిన తరువాత మూడు కేసుల్లో ఉరి శిక్షలు పడ్డాయని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దిశ యాప్ను లక్షలాది మంది డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. మంత్రి ప్రసంగం తరువాత దిశ చట్ట సవరణ బిల్లు సభ ఆమోదం పొందింది.
టీడీపీ సభ్యులు వాకౌట్
ధిశ చట్టం సవరణ బిల్లు ఆమోదం సందర్భంగా టీడీపీ సభ్యులు మాట్లాడేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాంను అనుమతి కోరారు. ఎవరెవరు మాట్లాడతారో ముందుగా తనకు లిస్ట్ పంపించకుండా ఇలా మధ్యలో అడగడం సభా సంప్రదాయాలకు విరుద్ధమని పేర్కొంటూ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. మంత్రులు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. టీడీపీ సభ్యులు స్వీకర్తో వాగ్వివాదానికి దిగి సభ నుండి వాకౌట్ చేశారు.
ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాసు భూ యాజమాన్య హక్కు చట్టం బిల్లుపై ప్రసంగించారు. భూ యజమానులకు శాశ్వత హక్కులు కల్పించడమే లక్ష్యంగా ఈ బిల్లు ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రెవెన్యూ చట్టాలను సంస్కరించి తయారు చేసిన ఈ బిల్లుతో భూ వివాదాలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, సామినేని ఉదయభాను అన్నారు. చర్చ అనంతరం ఏపి భూహక్కుల యాజమాన్య బిల్లు కు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తొలుత ఈ బిల్లు ఉపసంహరించుకోవాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారు. దీంతో మరో సారి సభ నుండి టీడీపీ వాకౌట్ చేసింది. మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రవేశపెట్టిన ఏపి మున్సిపల్ లా సెకండ్ అమెండ్మెంట్ బిల్లుపై చర్చ అనంతరం సభ ఆమోదం తెలిపింది.