అనంతపురం, జనవరి 29: సులభ వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రధమ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచిలిలో కియో మోటార్సు కంపెనీ తయారు చేసిన తొలి కారును మంగళవారం చంద్రబాబు విడుదల చేశారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ తక్కువ సమయంలో కియా కారు మార్కెట్లోకి రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఆటో మొబైల్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారువుతోందని చంద్రబాబు అన్నారు. ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా నాలుగు వేల మందికి, పరోక్షంగా ఏడు వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. దేశంలోనే అతి తక్కువైన వర్షపాతం ఉన్న ప్రాంతం రాయలసీమ అన్నారు. ప్రస్తుతం రాయలసీమలో చాలా పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని చంద్రబాబు అన్నారు.
కియో మోటార్స్ సిఇఒ హెచ్డబ్ల్యూ పార్క్ మాట్లాడుతూ అనంతపురం ప్లాంట్తో భారత్లో మా కార్ల ఉత్పత్తి ప్రారంభమైందని అన్నారు.రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో 536 ఎకరాల్లో తొలి దశ ప్లాంట్ నిర్మించామని ఆయన అన్నారు. భారత్లో అటో మొబైల్ విప్లవానికి ఇది నాంది అన్నారు. భావితరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి హరిత ప్లాంట్ నిర్మాణమని చెప్పారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి తగినట్లుగా వాహనాల తయారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు తయారు చేస్తామని చెప్పారు.
కియా మోటార్స్ ఎండి కుక్కున్ షిన్ మాట్లాడుతూ త్వరలోనే భారత్లో తమ కార్లు ఉత్పత్తి కావడం సంతోషదాయకమని అన్నారు. భారత్తో మా బంధం సుదీర్ఘమైందని అయన పేర్కొన్నారు. అనంతపురంలో ప్లాంట్ను త్వరితగతిన నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించిందని అన్నారు. ఎంతగానో సహకరించిన ప్రభుత్వానికి కుక్యున్ షిన్ ధన్యవాదాలు తెలియజేశారు.