మహమ్మారి కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రతి ఒక్కరి పై పడుతుంది. దేశ ప్రధాని లు మొదలుకొని సామాన్యుల వరకు ఎవరిని విడిచి పెట్టడం లేదు. చికిత్స, వ్యాక్సిన్ లేని ఈ వైరస్ వల్ల అనేకమంది బలైపోతున్న నేపద్యంలో, ప్రపంచ దేశాల ప్రభుత్వాలు చాలా వరకు సామూహిక సమావేశాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి. ప్రస్తుతం మన దేశంలో కూడా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తున్న నేపథ్యంలో, కొత్త పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న తరుణంలో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కరోనా కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలు చాలా వరకు చేతులెత్తేసిన పరిస్థితి నెలకొంది.
పరిస్థితి ఇలా ఉండగా మరోపక్క వినాయక చవితి పండుగ వస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన ఖైరతాబాద్ గణేష్ మహోత్సవం విషయంలో ఖైరతాబాద్ గణేష్ కమిటీ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే ప్రతియేటా జరిగే గణేష్ మహోత్సవాలకు ఖైరతాబాద్ వినాయకుడు భారీఎత్తున భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణేషుడికి మంచి విశిష్టత ఉంది. తాజాగా కరోనా వైరస్ ఎఫెక్ట్ ఖైరతాబాద్ గణనాథుడి పై కూడా పడింది. దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా వైరస్ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్ర స్థాయిలో ఉండటంతో పాటు ముఖ్యంగా జిహెచ్ఎంసి పరిధిలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు ఎవరు రాకూడదని కమిటీ ప్రకటించింది.
ఇదిలా ఉండగా గణనాథుడు తన రూపాన్ని తగ్గించుకున్నాడు. ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం తయారీ ఇటీవల ప్రారంభమైంది. కరోనా నిబంధనల నేపథ్యంలో ఈసారి 9 అడుగులకే ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం ఉంటుందని ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది. అంతే కాకుండా పూర్తిగా మట్టితోనే గణపతిని నిర్మించాలని కమిటీ నిర్ణయించింది. 66 వ యేట రూపొందిస్తున్న ఖైరతాబాద్ గణనాథుడు ఈ సారి శ్రీ ధన్వంతరి నారాయణ మహా గణపతిగా భక్తులకు దర్శనమీయనున్నట్లు కమిటీ తెలిపింది. ఈ విగ్రహానికి ఓవైపు లక్ష్మీదేవి, మరోవైపు సరస్వతి దేవి విగ్రహాలను కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. కోల్ కత్తాకు చెందిన కళాకారులు ఈ విగ్రహాన్ని తయారు చేయనున్నట్లు కమిటీ సభ్యులు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఈసారి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు, కరోనా రూల్స్ కారణంగా ఖైరతాబాద్ గణేష్ ని చూడటానికి దర్శనం కోసం భక్తులు ఎవరు రావద్దని ఉత్సవ కమిటీ విజ్ఞప్తి చేసింది.