Ys Sharmila: వైఎస్ షర్మిల Ys Sharmila.. పొలిటికల్ పార్టీపై తెలంగాణలోని ఇతర పార్టీల నుంచి వాగ్భాణాలు వస్తూనే ఉన్నాయి. అయినా ఆమె వెనకడుగు వేయడం లేదు. రాజన్న రాజ్యం కోసం శ్రమిస్తాను అంటున్నారు. ఈ క్రమంలో జిల్లాలవారీగా వైఎస్ అభిమానులను ఆమె స్థాపించబోయే పార్టీకి బలంగా మార్చుకుంటున్నారు. ఖమ్మం నుంచి భారీ సభ పెట్టి అక్కడే పార్టీ ఏర్పాటు, పేరు ప్రకటన చేయాలని చూస్తున్నారు. ఇంతలోనే అదే ఖమ్మం జిల్లాలో ఆమెకు షాక్ తగిలింది. జిల్లాలోని రఘునాధపాలెం మండలం శివాయిగూడెంలో వైఎస్సార్ విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది.
దీనిపై షర్మిల స్పందించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తాను అనుకున్న లక్ష్యం దిశగా వెళ్తానని స్పష్టం చేశారు. ఇది పిరికిపందల చర్య అన్నారు. విగ్రహం ధ్వంసం చేసినంత తేలికగా వైఎస్ ను ప్రజల గుండెల నుంచి తొలగించలేరని అన్నారు. అయితే.. ఈ చర్య నిజంగా రాజకీయ ప్రత్యర్ధులే చేస్తే షర్మిల పార్టీకి మైలేజీ వస్తున్నట్టే చెప్పాలి. ప్రత్యర్ధులు షర్మిల రాకకు, పార్టీపై భయపడుతున్నారనే సంకేతాలు వెళ్తాయి. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులతోపాటు రేవంత్ రెడ్డి కూడా షర్మిలపై విమర్శలు చేస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి ఇంకా పూర్తిస్థాయి విమర్శలు అయితే రాలేదు.
అయితే.. షర్మిల పార్టీకి మద్దతు, మైలేజీ పెంచడం కోసమే ఎవరైనా కావాలనే ఇలా చేశారా అనే వాదనలూ లేకపోలేదు. ఇదే జరిగితే షర్మిల నుంచి మరింత పట్టుదల, ప్రకటనలు, ప్రజల్లోకి పార్టీ బలంగా వెళ్లాలనే ఇలా చేశారా అని కూడా కొన్ని వ్యాఖ్యలు వస్తున్నాయి. అయితే.. వైఎస్ పై అభిమానం చూపే ఎవరూ ఇటువంటి పనులు చేయరనేది వాస్తవం. ఇటువంటి చర్యలతో ఎవరూ ప్రజల్లోకి వెళ్లాలని కోరుకోరు. రాజకీయ ప్రత్యర్ధి వర్గాల్లోని కొందరు చేసే ఇటువంటి వనులు షర్మిలకే ప్లస్ అవుతాయని చెప్పాలి. వచ్చే నెల 9న ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు షర్మిల.