హైదరాబాద్: తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయటమే లక్ష్యంగా పని చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. మునిసిపల్ ఎన్నికల వ్యూహాన్ని రచించేందుకు శుక్రవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టీఆర్ఎస్కే పట్టం కట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. 2014లో 63 సీట్లను గెల్చుకున్న టీఆర్ఎస్ 2018 ఎన్నికల్లో ఏకంగా 88 సీట్లతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందన్నారు. విపక్షాల పరిస్థితి ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా ఉందన్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటేనే కాంగ్రెస్ భయపడుతోందని ఎద్దేవా చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో పల్లెలు బాగుండాలన్న లక్ష్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాన్నిచేపట్టి విజయవంతం చేశామని అన్నారు. పల్లెలు, పట్టణాలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. పంచాయితీరాజ్ చట్టం వచ్చాక గ్రామాల్లో అద్భుతమైన మార్పులు వస్తున్నాయని, రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు పుష్కలంగా నిధులు ఇచ్చామని చెప్పారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలే ఎజెండాగా ముందుకుపోతామని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ దూసుకుపోతోందని చెప్పారు. తాము నేల విడిచి సాము చేయడం లేదన్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?