తెలంగాణ రాజకీయాల్లో నిత్యం చర్చల్లో ఉండేది ‘కేటీఆర్ ను సీఎం చేస్తారు’ అనే అంశమే. ఇందుకు కారణాలు లేకపోలేదు. 2018 ఎన్నికల సమయంలోనే ఈ చర్చ వార్తల్లో నిలిచింది. సీఎం కేసీఆర్.. తాను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయల్లోకి వెళ్తానని పబ్లిగ్గానే చెప్పారు. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలిసారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసి 2019లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచన చేసారని కూడా వార్తలు వచ్చాయి. అనుకోని కారణాల వల్ల అప్పట్లో సాధ్యం కాలేదు.
ఇప్పుడు మరోసారి ‘కేటీఆర్ సీఎం అవుతారు’ అనే అంశం వార్తల్లో నిలుస్తోంది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా కేసీఆర్ తాను జాతీయ రాజకీయాల వైపు వెళ్తాననే చెప్పారు. ఇందుకు స్టాలిన్, జగన్, మమతా బెనర్జీ.. వంటివారిని కూడా సన్నిహితులను చేసుకున్నారు. వీరితోపాటు జాతీయస్థాయి పార్టీలతో పెద్దగా సుముఖంగా లేని వారిని కలుపుకుని వెళ్లాలనేది ఆయన ఆలోచన. ఈ సమయంలో కేసీఆర్ కు పగ్గాలు అప్పగిస్తారని అంటున్నారు. అందుకు కేటీఆర్ కు కొత్త వేదికను ఏర్పాటు చేసేందుకే కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ శ్రద్ధ పెట్టారని కూడా అంటున్నారు.
నిజానికి గత ఏడాది జూన్ లోనే శంకుస్థాపన జరిగినా కోర్టు తీర్పు నేపథ్యంలో వాయిదా పడింది. ప్రస్తుతం పనులు వేగం కావడంతో మరో ఏడాదిలో సచివాలయం పూర్తి చేసి సీఎంగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తారని టీఆర్ఎస్ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఆ తర్వాతే జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రయాణంలో ఫలితమెలా ఉండబోతున్నా 2024 ఎన్నికలకు ధర్డ్ ఫ్రంట్ తో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనేది కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది.