దుబ్బాక ఉప ఎన్నిక… అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి తన సత్తా చాటుకునే వేదిక అయితే ప్రతిపక్ష బీజేపీకి పరువు సమస్యగా మారిన ఎన్నిక.
ఈ పోరు విషయంలో ఇప్పటికే టీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు ఆవు గత కొద్దిరోజులుగా అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే, దుబ్బాక ఉప ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్చాట్ నిర్వహించారు.
హరీశ్ రావు ఆశ్చర్యపోయేలా….
దుబ్బాక చైతన్యాల గడ్డ.. రామలింగారెడ్డి విప్లవాల నుంచి వచ్చారని మంత్రి కేటీఆర్ తెలిపారు. “గతంలో తాను దుబ్బాకలో ఎన్నికల ప్రచారం నిర్వహించాను. అక్కడి ప్రజల నాడీ నాకు బాగా తెలుసు. దుబ్బాకలో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పు వస్తుంది` అని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదన్నారు. ఈ ఉప ఎన్నికలో గతంలో కంటే అధిక మెజార్టీ టీఆర్ఎస్ పార్టీ సాధిస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టే.. ఏ ఎన్నికల్లో అయినా ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
హరీశ్ అయినా… నేనైనా….
జిల్లా మంత్రి హరీష్ రావు నాయకత్వంలో దుబ్బాకలో ముందుకెళ్తున్నామని కేటీఆర్ తెలిపారు. దుబ్బాకలో తన ప్రచారం అవసరం లేదని అనుకుంటున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. హరీష్ రావు అయినా, తాను అయినా కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తామని తేల్చిచెప్పారు. దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రచారంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రచారం చేసే విషయంపై కేసీఆరే స్వయంగా నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో సీఎం కేసీఆర్ ప్రచారం చేయకున్నా బ్రహ్మాండమైన మెజారిటీ సాధించాం అని గుర్తు చేశారు. దుబ్బాకకు బీజేపీ, కేంద్రం ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. శ్వేతపత్రం విడుదల చేయాలని టీఆర్ఎస్ పార్టీని అడగడం సరికాదన్నారు.