హైదరాబాద్ జనవరి 15 వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ తో బుధవారం టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె టి రామారావు బృందం చర్చలు జరపనుంది.
ఫెడరల్ ఫ్రెండ్ లో కలిసి వచ్చే విషయంపై వైసీపీ తో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి టి ఆర్ ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు నిర్ణయించారు. కెసిఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ బృందం జగన్ ను కలిసి చర్చలు జరపనున్నారు.
ఈ విషయంపై కేటీఆర్ బృందం మంగళవారం రాత్రి జగన్ కు సమాచారం అందించగా కలిసేందుకు అంగీకరిస్తూ డిన్నర్ కు రావాల్సిందిగా ఆహ్వానించారు. కేటీఆర్ తో పాటు టిఆర్ఎస్ నేతలు వినోద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులు జగన్ ను కలిసి చర్చలు జరపనున్నారు.
కాంగ్రెసేతర, బిజెపియేతర పార్టీలను ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్ గా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారని కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
ఈ క్రమంలో భాగంగా ఇప్పటికే ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిలు నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ, యుపి మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తదితరులతో కెసిఆర్ చర్చలు జరిపారు.
ఇప్పటి వరకు జాతీయస్థాయిలో యూపీఏ, ఎన్ డి ఏ కూటమిలలో జగన్ లేని కారణంగా ఆయన్ను ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారు .
దీనిపై జగన్ కు వర్తమానం పంపగా కలిసి చర్చలు జరపడానికి అంగీకారం తెలిపారు.