Kuppam : రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీని ఓడించాలనుకోవడం సహజమే. ప్రత్యర్థి పార్టీ ముఖ్య నాయకుడిని ఓడించాలనుకోవడం సహజమే..! అది ప్రజాబలంతోనో, తమ పార్టీ బలంతోనో జరగాలి..! కానీ కుప్పంలో టార్గెట్ చంద్రబాబు విషయంలో వైసీపీ తమ పార్టీ బలం, ప్రజాబలం, స్ట్రాటజికల్ బలంతో పాటూ ప్రత్యర్థి బలహీనతల్ని కూడా వాడుకుంటుంది. ఒక పెద్ద పొలిటికల్ స్ట్రాటజికల్ ప్లాన్ వేసి, దీనిలో చంద్రబాబుని ఇరికిస్తుంది. చంద్రబాబు కుప్పం నుండి పోటీ చేయడానికి భయపడేలా.., ఒకవేళ పోటీ చేస్తే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా జగన్ – పెద్దిరెడ్డిల ద్వయం ఒక పక్కా స్కెచ్ తో వెళ్తుంది. దీనిలో జగన్ కంటే ఎక్కువగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కసిగా పనిచేస్తున్నారు.
Kuppam : పెద్దిరెడ్డి ప్రతీకారం ఇదేనా..!?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – చంద్రబాబులు అయిదు దశాబ్దాల నుండి శత్రువులే. ఇద్దరూ ఒకే యూనివర్సిటీలో పీజీ చదివారు. నాడే ఇద్దరూ చెరో విద్యార్ధి సంఘానికి నేతృత్వం వహించారు. అప్పటి నుండి స్వల్పంగా చంద్రబాబుదే పైచేయి అయ్యేది. ఈ క్రమంలోనే 1970 ల కాలంలో ఇద్దరూ కాంగ్రెస్ లో పని చేయాల్సి వచ్చినా ఏ నాడూ కలవలేదు. చివరికి చంద్రబాబు 1985 లో టీడీపీలో చేరిన తర్వాత పెద్దిరెడ్డి కాంగ్రెస్ లో కొనసాగుతూ వచ్చారు. ఎవరి పార్టీ అధికారంలో ఉంటె.. వారు ఇతరులపై ఆధిపత్యం చెలాయించేవారు. ఈ క్రమంలోనే 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు కొంచెం ఎక్కువగానే పెద్దిరెడ్డిని టార్గెట్ చేసారు. 2016 , జనవరి 16 న ఓ చిన్న కేసులో పెద్దిరెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేయించారు. నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చాల ఎమోషనల్ అయ్యారు. “చంద్రబాబు పతనం చూస్తాను. మా దెబ్బ చంద్రబాబుకి చూపిస్తాను, ఇక చంద్రబాబు రాజకీయం పూర్తయినట్టే” అంటూ చాల ఘాటుగా మాట్లాడారు. అలా చంద్రబాబుపై పెద్దిరెడ్డి ప్రతీకారేచ్చతో రగిలిపోయారు.
కచ్చితంగా చదవండి : కుప్పంలో ఏం జరిగింది..? “న్యూస్ ఆర్బిట్” కీలక గ్రౌండ్ రిపోర్ట్ (Click Here)
జగన్ పగా కారణమే కావచ్చు..!!
ఇక సీఎం జగన్ అంటే చంద్రబాబుపై పగా పట్టడం సహజమే. జగన్ సాధారణ రాజకీయ నేత కాదు. రాజకీయంగా చిన్న వయసులోనే చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. జాతీయ పార్టీలను ఢీకొనడం, జైలుకి వెళ్లడం, సీబీఐ కేసులను ఎదుర్కోవడంతో కొంత రాటుదేలారు. తనను నాడు ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళల్లో చంద్రబాబు పేరు కూడా ప్రముఖమే అనే సంగతి జగన్ కి తెలుసు. అందుకే చంద్రబాబుని జగన్ కేవలం రాజకీయ ప్రత్యర్థిగానే కాకుండా.., వ్యక్తిగత ప్రత్యర్థిగా కూడా చూస్తుంటారు. సో.. చంద్రబాబుని మళ్ళీ గెలవకుండా చేయాలనేది జగన్ పగా కావచ్చు. అందుకే అటు పెద్దిరెడ్డి ప్రతీకారం, జగన్ పగా కలిసి చంద్రబాబుని కుప్పం వేదికగా ఫిక్స్ చేసినట్టు స్పష్టంగా చెప్పుకోవచ్చు.
కుప్పం : మూడు నెలల్లో ఎన్ని మార్పులో..!?
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ కాకుండా వేరే పార్టీ గెలవడం అంత ఈజీ కాదు. కానీ వైసీపీ ఒక పకడ్బందీ వ్యూహం వేసింది. సెప్టెంబర్ చివరి వారంలోనే కుప్పంలో ఒక సర్వే నిర్వహించారు. చంద్రబాబు బలం, బలహీనతలు… టీడీపీ ముఖ్యులు.., టీడీపీ గెలుపునకు కారణాలు అన్నిటినీ ఆ సర్వే ద్వారా తెలుసుకున్నారు. అప్పటి నుండి కొన్ని ప్రణాళికలు అమలు చేస్తూ వచ్చారు. దాదాపు 120 మంది మండల / నియోజకవర్గ స్థాయి టీడీపీ నేతలను వైసిపిలో చేర్చుకున్నారు. వారి ద్వారా చంద్రబాబుకి అండగా నిలుస్తున్న కీలక సామాజికవర్గం గండ్లపై కన్నేసారు. ఇతర బీసీ వర్గాలను ఒక ప్రణాళిక ప్రకారం టీడీపీకి దూరం చేసేలా కొన్ని ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే తాము చేసిన ప్రయత్నాలు ఎంత మేరకు ఫలించాయో తెలుసుకునేందుకు డిసెంబర్ నెలలో మరో సర్వే నిర్వహించారు. “పంచాయతీ ఎన్నికలు జరిగితే టీడీపీకి 55 .., వైసీపీకి 34 పంచాయతీలు వచ్చే అవకాశం ఉంది” అని తెలియడంతో ఇక ప్లాన్ మార్చారు. చంద్రబాబుకి అత్యంత ముఖ్యులైన నేతలను టార్గెట్ చేసారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పీఏ మనోహర్ సహా కీలకమైన నేతలను సైలెంట్ చేయడం, పక్కకు మళ్లించడం, పార్టీలో చేర్చుకోవడం ద్వారా పెద్దిరెడ్డి స్ట్రాటజికల్ పాలిటిక్స్ చేసారు. అలా… కుప్పంలో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరవేయగలిగారు. ఇది ఆరంభం మాత్రమే. వచ్చే నెలలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలల్లో కూడా కుప్పంలో వైసీపీ జెండానే అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. దానికి కూడా ఒక స్ట్రాటజీ, ప్లాన్ ఫిక్స్ చేశారు..!!