Kuppam TDP : ఓ ఓటమి పార్టీకి కుదిపేసింది. ఓ ఓటమి నేతలను కిందకు దించుతుంది. ఓ ఓటమి పార్టీలో కప్పేసిన నిజాలను బయట పెడుతుంది. కుప్పం టీడీపీలో ఇదే జరుగుతుంది. పంచాయతీ ఎన్నికల్లో ఘోర ఓటమి ఆ నియోజకవర్గ టీడీపీని అతలాకుతలం చేసింది. ఈరోజు జరిగిన పార్టీ అంతర్గత సమావేశం ఆ నియోజకవర్గ కీలక నేతల నలుగురి రాజీనామాకు దారి తీసింది. కార్యకర్తల నిలదీతకు వేదికయింది. “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా సేకరించి వివరాలు ఇలా ఉన్నాయి..!!
Must Read : కుప్పంలో ఏం జరిగింది..!? టీడీపీ ఎందుకు ఓడింది..!? “న్యూస్ ఆర్బిట్” కీలక విశ్లేషణ..!!
Kuppam TDP : నాయకుల నిలదీత..! రాజీనామా..!!
పంచాయతీ ఎన్నికల్లో పార్టీ ఓటమి, కార్యకర్తల పనితీరు, నాయకుల వ్యవహారశైలిపై సమీక్ష చేసేందుకు పార్టీ అధినేత చంద్రబాబు ఈ నెల 25 , 26 తేదీల్లో కుప్పం పర్యటన పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు (మంగళవారం సాయంత్రం) సన్నాహక సమావేశం నిర్వహించారు. నాలుగు మండలాల కార్యకర్తలతో ఆ నాలుగు మండలాల పార్టీ ఇంచార్జీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కార్యకర్తల ఆగ్రవేశాలు బయటపడ్డాయి. నాయకులు అధికార పార్టీకి అమ్ముడుపోయారని.. నాయకుల నిర్లక్ష్యం వల్లనే పార్టీ ఓడిపోయింది అంటూ కార్యకర్తలు నిలదీశారు. నాలుగు గోడల మధ్య, ఆఫ్ ది రికార్డు నిర్వహించిన సమావేశం కావడంతో కార్యకర్తలు చాలా మంది ఓపెన్ అయిపోయారు. మండలాలకు ఇంచార్జిలుగా ఉన్నా నాయకులు ఎవరెవరు .. ఏ విధంగా అధికార పార్టీకి అమ్ముడుపోయారో.., ఎవరెవరు ఏం చేశారో తెలుసు అంటూ కొందరు కార్యకర్తలు గట్టిగానే నిలదీశారు. ఇంకొందరు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దాదాపు గంటన్నర పాటూ కార్యకర్తల నుండి తిరుగుబాటు ఎదురయింది. దీంతో ఆ నలుగురు నాయకులు పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.
Must Read : జగన్ పగా..? పెద్దిరెడ్డి ప్రతీకారం..!? కుప్పంపై న్యూస్ ఆర్బిట్ రిపోర్ట్..!!
నలుగురే నాలుగు స్తంభాలు..!!
కుప్పంలో చంద్రబాబు ఉండరు, ప్రచారం చేయరు, ఏడాది మొత్తం మీద పది, పదిహేను రోజులు మాత్రం ఉంటారు. కానీ గెలుస్తారు. దానికి కారణం కార్యకర్తల బలం, నాయకుల పనితీరు. పార్టీ అధికారంలో ఉండడంతో.. ప్రత్యర్థి పార్టీ గట్టిగా దృష్టి పెట్టకపోవడంతో ఇన్నాళ్లు నాయకుల వ్యవహారాలు బయటకు రాలేదు. ఇటీవల పెద్దిరెడ్డి నేతృత్వంలోనే వైసిపి బృందం కుప్పంపై సీరియస్ ఫోకస్ పెట్టడంతో కుప్పం కోట బద్దలయింది. కూపీ బయటకు వచ్చేసింది. దీంతో నాలుగు మండలాల ఇంచార్జిల కారణంగానే పార్టీ ఓడింది అంటూ కార్యకర్తలు రగిలిపోతున్నారు. కుప్పం నియోజకవర్గంలోని బోడుపల్లి, శాంతిపురం, కుప్పం, రామకుప్పం నాలుగు మండలాలకు ఎమ్మెల్సీ శ్రీనివాసులు, చంద్రబాబు పీఏ మనోహర్, మునిరత్నం, తదిరతులు ఇంచార్జిలుగా ఉన్నారు. తాజాగా కార్యకర్తలు వీరిపై తిరుగుబాటు చేశారు. మీ అవినీతి వ్యవహారాలు, మీ లోపాలు, మీ ప్రలోభాల కారణంగా పార్టీని సరిగా పట్టించుకోలేదు… పైగా కార్యకర్తలనే నిందిస్తారా..? ఓటమి బాధ్యత మీదే అంటూ కార్యకర్తలు తిరుగుబాటుతో ఆ నాలుగు నేతలు రాజీనామా చేసినట్టు తెలిసింది. మొత్తానికి మూడున్నర దశాబ్దాల కుప్పం కోటాలో కుదుపు చంద్రబాబుకి చాలా తలనొప్పి వ్యవహారంగా మారింది..!!