తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలహీన పడింది అన్న సంగతి అందరికీ తెలిసిందే. బలహీనం అనేది నాయకత్వంలో, నాయకుల్లో తప్పితే కార్యకర్తలపరంగా మాత్రం కాదు. ఆ పార్టీకి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ, బూత్ స్థాయిలో కూడా బలమైన కార్యకర్తలు ఉన్నారు. పార్టీ పట్ల నిబద్దత, కసి, ప్రాణం పెట్టి పనిచేసే ధీశాలులు కూడా ఉన్నారు. కానీ పార్టీని వేధిస్తున్నది అంతా నాయకత్వ లోపమే. ఇక ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి చూస్తే ఘాడ నిద్రలో ఉన్నది అంటున్నారు. నిజానికి రాష్ట్రంలోని చాలా జిల్లాలలో పార్టీ పరిస్థితి నిద్రావస్థలో ఉన్నప్పటికీ ప్రకాశం జిల్లాలో మాత్రం ఘాఢంతరవస్థకు చేరుకుంది. జిల్లా స్థాయిలో పార్టీని నడిపించే దిక్సుచి అందుబాటులో లేక నియోజకవర్గాల్లో బాద్యులు కూడా సరిగా స్పందించక కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్ళిపోతున్నారుట.
గతంలో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా దామచర్ల, కారణం బలరాం, మాగుంట, శిద్దా రాఘవరావు లు ఉండేవారు. అయితే వీరిలో దామచర్ల మినహా మిగిలిన ముగ్గురు వైకాపాలో చేరిపోయారు. ప్రస్తుతం టీడీపీకి ఉన్న ఇద్దరు ఎమ్మెల్యే లు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావులు జిల్లా పార్టీ పగ్గాలు మోయడానికి సిద్ధంగా లేరట. వీరిద్దరూ సొంత వ్యాపారాలు, ఇతర తలనొప్పుల కారణంగా జిల్లా నాయకత్వాన్ని భుజాన వేసుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం అధికార వైసీపీ.. ప్రతిపక్షంపై మరీ దూకుడుగా వెళుతుండటంతో జిల్లాలోని చాలా మంది నియోజకవర్గ బాద్యులు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారుట. దర్శి, చీరాల, యర్రగొండపాలెం తదితర నియోజకవర్గాలలో కార్యకర్తలకు కష్టం వస్తే పట్టించుకునే వారే లేరు. కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, సంతనూతలపాడు నియోజక వర్గాలలో నేతలు ఉన్నా కార్యకర్తలకు భరోసా కల్పించే పరిస్థితులు లేవట. పార్టీ కోసం గట్టిగా నిలబడిన కార్యకర్తలపై కేసులు పెడితే విడిపించే పరిస్థితి కూడా లేదుట. దీనితో ఆయా నియోజకవర్గాలలోని పార్టీ శ్రేణులు పూర్తిగా సైలెంట్ అయిపోయారని టాక్ వినిపిస్తోంది. ఒంగోలులోనూ పరిస్థితి భిన్నంగా ఏమి లేదట. టీడీపీలో పెద్ద పెద్ద నాయకులే ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో గ్రామ, మండల స్థాయి నాయకులు దాదాపు సైలెంట్ అయ్యారని అంటున్నారు. దీనితో చాలా ప్రాంతాల్లో కార్యకర్తలు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా పోతాయన్న భయంతో జెండాలను పూర్తిగా పక్కకు పెట్టేశారని అంటున్నారు.