ఏపిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మరో చారిత్రక ఘట్టానికి పునాది రాయి వేశారు. వైఎస్ఆర్ – జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సోమవారం కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రారంభించారు. తెలంగాణ సరిహద్దు గ్రామం తక్కెళ్లపాడులో సరిహద్దు రాయిని పాతి భూసర్వేకు శ్రీకారం చుట్టారు. అనంతరం జగ్గయ్యపేట ఎస్ జీ ఎస్ కళాశాల మైదానంలో రీసర్వే ఆర్మీ ఫోర్స్ కి సీఎం జగన్ పచ్చ జెండా ఊపి, రీ సర్వే కోసం సిద్ధ చేసిన డ్రోన్స్ ను ప్రారంభించారు.
రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భూముల రీసర్వే ప్రారంభం కానున్నది. మూడు విడతల్లో 1.26 కోట్ల హెక్టార్లలో సమగ్ర భూ సర్వే కార్యక్రమాన్ని 2023 జనవరి నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అనంతరం రికార్డులను గ్రామ సచివాలయాల్లో పొందుపర్చనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన కృష్ణదాసు, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, పలువురు ఎమ్మెల్యేలు, సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పాల్గొన్నారు.
భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి ఈ భూ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుంది. దాదాపు వంద సంవత్సరాల తరువాత రాష్ట్రంలో భూసర్వే జరుగుతోంది. రాష్ట్రంలో 1920-27 మద్యలో భూముల సర్వే జరిగింది. మళ్లీ ఇంత వరకూ జరగలేదు. ఈ సర్వే మూలంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో యజమానులకు ఇప్పటి వరకూ వాడుకునేందుకు మినహా మరే ఇతర అవసరాలకు పనికి రాకుండ ఉన్న దాదాపు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ఆస్తికి రాష్ట్ర ప్రభుత్వం అధికార ముద్ర వేయనుంది. గ్రామాల్లో ఉండే ఇళ్లు, పశువుల కొట్టాలు, ఇతర ఖాళీ స్థలాలకు వాటి యజమానుల పేరిట సర్టిఫికెట్లు ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.