టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, ఏపీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య సఖ్యత ఉన్న సంగతి తెలిసిందే. రాజకీయ ఎత్తుగడల నుంచి మొదలుకొని తమ తమ రాష్ట్రంలో పరిపాలన వరకూ వివిధ అంశాలను చర్చించుకుంటున్నారు.
అయితే, కృష్ణా – గోదావరి జలాల మధ్య విబేధాలు నెలకొన్నాయి. ఏకంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం సైతం జరిగింది. ఈ విషయంలో వివిధ చర్చలు కొనసాగుతుండగా తాజాగా ఇందులో కీలక అంశం తెరమీదకు వచ్చింది. ఈ ఇద్దరు నేతలు ప్రత్యేక సమావేశం జరగాలని ఓ సీనియర్ నేత ఆకాంక్షించారు.
నోరు జారడంతోనే సమస్యలు
బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, దేశాభివృద్ధి, రక్షణ కోసం కేంద్రంలో బీజేపీ ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లును వైసీపీ ఎంపీలు మద్దతు తెలిపారని గుర్తు చేశారు. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వంపై కోపం లేదని, అంశాల వారీగా విబేధాలు మాత్రం ఉంటున్నాయని చెప్తున్నారు. ఇతర రాష్ట్రాలకంటే మెరుగ్గానే ఏపీకి నిధులు ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలని టీజీ వెంకటేష్ సూచించారు. ఏపీకి రావాల్సిన అభివృద్ధి నిధులు, లోటు బడ్జెట్ నిధులు ఎక్కువగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇరు ప్రభుత్వాలు సామరస్యంగా సాగుతుండగా కొందరు నాయకులు నోరు జారుతున్న కారణంగా సంబంధాలు దెబ్బతిన్నాయని బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళు అద్దాల మేడలో ఉన్నట్టేనని వెల్లడించారు. కేంద్రంతో సంబంధాలు బాగుంటే రాష్ట్రానికి మరింత మేలు జరుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.
సీమలో సమ్మర్ క్యాపిటల్… విశాఖలో వింటర్ క్యాపిటల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన వికేంద్రీకరణ చేస్తే సమస్య ఎదురవదని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. రాష్ట్ర పాలన వికేంద్రీకరణ చేస్తే అన్ని ప్రాంతాల ప్రజలు హర్షిస్తారని, ఇది కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే ఆచరణలో ఉందని తెలిపారు. అయితే, ఏపీలో ఇపుడు జరుగుతున్నది వికేంద్రీకరణ కాదు, మూడు భాగాలుగా విభజించిన కారణంగానే సమస్య మొదలైందన్నారు. వికేంద్రీకరణ అంశం కోర్టులో ఉన్న సమస్య, పరిష్కారానికి చాలా సమయం పడుతుందని టీజీ వెంకటేష్ అన్నారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి చేసే అవకాశాలు చాలా వున్నాయని, అలాగైతేనే కలకాలం కలసి ఉంటామని తెలిపారు. రాయలసీమలో సమ్మర్ క్యాపిటల్, విశాఖలో వింటర్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుందని టీజీ వెంకటేష్ చెప్పుకొచ్చారు. ఇపుడున్న పరిస్థితుల్లో సమ్మర్ క్యాపిటల్, వింటర్ కాపిటల్ ఏర్పాటు మంచి పరిష్కారం అని వెల్లడించారు.
కేసీఆర్కు జగన్ స్పెషల్ భోజనం
గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్లను ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ ప్రస్తావించారు. “తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో జగన్ ఆహ్వానించి భోజనం పెట్టి సన్మానించామని, అయినా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తున్నారని అన్నారు. అందుకే, జగన్ కూడా కేసీఆర్ను ఆహ్వానించి మూడు పూటలా విందు ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ గురించి అర్థమయ్యేలా చెప్పాలి. తెలంగాణకు ఎలాంటి నష్టం లేదని కేసీఆర్ కు వివరించాలి.“ అని టీజీ వెంకటేష్ సూచించారు.
వెనకడుగు వేయకు జగన్
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు లిఫ్ట్ ద్వారా నీటిని తరలించడంలో సీఎం జగన్ ఏమాత్రం వెనకడుగు వేయరాదని టీజీ వెంకటేష్ చెప్పుకొచ్చారు. “తెలంగాణ నీటిని తోడేస్తే రాయలసీమకు అన్యాయం జరుగుతుంది. తెలంగాణ వాటా నీటిని కోరుకోవడం లేదు..రెండు రాష్ట్రాల రైతులు నష్టపోకూడదు. తెలంగాణ నేతలకు ఏపీ వాళ్ళతో అవసరం ఉంటుంది. తెలంగాణలో ఏపీ ప్రజల ఓట్లు ఎక్కువగా ఉన్నందున వారికి ఏపీ మద్దతు అవసరం ఉంది. ఏపీలో తెలంగాణ నేతలకు ఓట్లు లేవు. తెలంగాణ నాయకులకు భయపడాల్సిన అవసరం లేదు. కృష్ణ రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు కర్నూలులోనే ఏర్పాటు చేయాలి“అని సూచించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?