ఒక రాష్ట్ర చరిత్రలో గానీ, ప్రజా జీవితంలోగాని, వ్యవస్థలకు సంబంధించిగానీ, రాజకీయ సమీకరణల్లో గానీ ఏరకంగా చూసినా.. ఎక్కడా, ఎప్పుడూ జరగని ఒక పెద్ద మార్పు ఆంధ్రప్రదేశ్ లో గడిచిన మూడేళ్ళ కాలంలో జరిగింది.
ఒక కుటుంబంలో చూసుకున్నా రెండు, మూడేళ్ళలో పెద్దగా మార్పు కనిపించదు. అలాంటిది దేశ చరిత్రలోనే తొలిసారిగా గడిచిన ఈ మూడేళ్ళలో అన్నిరకాలుగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనదైన రికార్డు సృష్టించుకుంటూ తనకు తానే ఒక చోదక శక్తిగా, నూతన వ్యవస్థకు శ్రీకారం చుట్టిన దార్శనికుడిగా ముందుకు సాగుతున్నారు.
జగన్ పాదయాత్ర ఓ ప్రత్యేకత
2017 నవంబరు 6న ఇడుపులపాయ నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర రాష్ట్రంలోని 134 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగుతూ 14 నెలలపాటు 3,648 కిలో మీటర్లు పొడువున ఇచ్ఛాపురం వరకూ సాగింది. ఎండనకా, వాననకా, జనంలో తాను ఒకడిగా.. 14 నెలలపాటు జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోనే ఉన్నారు. రాత్రిపూట గుడారాల్లో బస చేస్తూ.. ఒకవైపు పార్టీని నడపడం, మరోవైపు భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు రూపొందించుకుంటూ, ఇంకోవైపు ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థులను ఎంపిక చేసుకుంటూ ఒక మహాయజ్ఞం తరహాలో జగన్ మోహన్ రెడ్డి ముందుకు వెళ్ళారు. బహుశా ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా జగన్ ఒకే జాబితాలో 175మంది అసెంబ్లీ అభ్యర్థులు, 25 మంది పార్లమెంటు అభ్యర్థులను ప్రకటించారు ఇదీ ఒక చరిత్రే.
పాదయాత్రతో ప్రత్యేక రికార్డు సొంతం
పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉంటూనే, సమర్థవంతంగా పార్టీని నడుపుతూ.. కొన్ని లక్షల మంది ప్రజలను నేరుగా కలిసి, వారి సమస్యలు వింటూ.. ఆ తర్వాత మరో మూడు నెలలపాటు ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల్లో 151 సీట్లతో, 22 మంది ఎంపీలను గెలిపించి, అఖండమైన మెజార్టీతో గెలిచి మే 30న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 17 నెలలుగా పరిపాలన చేస్తున్నారు. మొదటి 14 నెలలు జనంలో ఉండి.. మరో 17 నెలలుగా జనం కోసం ప్రభుత్వాన్ని నడుపుతూ, ప్రజలకోసమే పూర్తిగా అంకితం అవుతూ పరిపాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు 6 నుంచి 10 రోజులపాటు.. ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.