Chandrbabu Kurnool Tour : చంద్రబాబు కర్నూలు టూర్ Chandrababu Kurnool Tour.. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీకి రాజధానిగా అమరావతిని తెరపైకి తెచ్చారు. 29 గ్రామాల్లోని రైతుల నుంచి భూములు తీసుకుని రాజధాని నిర్మాణం ప్రారంభించారు. 2019 ఎన్నికల సమయానికి అమరావతి ప్రాంత నిర్మాణాలు, అభివృద్ధి.. ఆయనకు ఓటమి రుచి చూపించాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు తన ఓటమికి కారణాలు అన్వేషించుకునే పనిలో ఉండగా జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. అమరావతిలో ఉద్యమాలు మొదలయ్యాయి. అయితే.. చంద్రబాబు, లోకేశ్ తోసహా ఏ టీడీపీ నాయకుడు కూడా అక్కడి రైతుల తరపున పెద్దగా పోరాడింది లేదు. విశాఖకు పరిపాలనా రాజధాని, కర్నూలుకు న్యాయ రాజధాని అనవసరం అనే ప్రకటనలు తప్ప.
ఇదే అంశాన్ని చంద్రబాబు అండ్ టీమ్ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. విశాఖలో రాజధాని రావడం విశాఖ ప్రజలకు ఇష్టం లేదని.. కర్నూలులో హైకోర్టు రావడం అక్కడివారికి ఇష్టం లేదంటూ చెప్పుకొచ్చారు. అయితే.. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కర్నూలు పర్యటనకు వెళ్లారు. అక్కడ చంద్రబాబుకు న్యాయవాదుల సెగ తగిలింది. కర్నూలుకు న్యాయ రాజధాని ఎందుకు వద్దు? హైకోర్టు ఏర్పాటును మీరెందుకు అడ్డుకుంటున్నారంటూ అక్కడి న్యాయవాదులు ఆయన కాన్వాయ్ కు అడ్డు తగిలారు. ఇందుకు సీఎం జగన్ ను నిందించే ప్రయత్నం చేసి చంద్రబాబు అక్కడి నుంచి బయటపడ్డారు.
మొత్తంగా రాజధాని విస్తరణ ఎందుకు వద్దనేది డైరక్ట్ గా చంద్రబాబుకే తగిలింది. కర్నూలు హైకోర్టుకు వెళ్తే టైప్ రైటర్లు తప్పితే ఏం వస్తుందని టీడీపీ నాయకులు అన్నారు. హైటెక్ సిటీ ప్రాంతం అభివృద్ధి, అమరావతి ప్రాంతం విలువ చంద్రబాబు వల్లే అని చెప్పుకుంటారు టీడీపీ నాయకులు. మరి.. కర్నూలు, విశాఖల్లో రాజధాని ఏర్పాటైతే అక్కడ అభివృద్ధి జరగదని ఎందుకు చెప్తున్నారో వారికే అర్ధం కావాలి. మొత్తంగా చంద్రబాబుకు కర్నూలు న్యాయవాదుల సెగ తగిలినట్టే. మరి.. మున్ముందు టీడీపీ ఈ అంశాన్ని ఎలా ఎదుర్కొంటుందో చూడాల్సి ఉంది.