బండి సంజయ్ స్పీడు.., బంగారు లక్ష్మణ్, కిషన్ రెడ్డిల తోడు.. బీజేపీకి కలిసొచ్చినట్టే కనిపిస్తున్నయ్..! ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో కమల వికాసం కనిపిస్తుంది. కారు ఏ మాత్రం ఊహించని చోట.., టీఆరెస్ బలంగా ఉన్న చోట.. కమలం కలలు కూడా కానని చోట బీజేపీ ఆధిక్యంలో ఉండడం ఆ పార్టీకి జోష్ ఇచ్చే అంశమే..!
2009 లో బీజేపీకి వచ్చిన డివిజన్లు 4 .. 2016 కూడా నాలుగే వచ్చాయి. కానీ ఇప్పుడు నలభై స్థానాల్లో ఆధిక్యం ఉండడం.., గెలుపుకి చేరువవ్వడం ఆ పార్టీకి కొత్త జోరు కనిపిస్తుంది. ముఖ్యంగా టీఆరెస్ బలంగా ఉంది అనుకున్న ఎల్బీ నగర్, హబ్సిగూడ, గోషామహల్ ప్రాంతాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉండడం విశేషమే. ఇది కచ్చితంగా బీజేపీకి జోరు ఇచ్చే ఫలితాలే. బీజేపీకి మేయర్ పీఠం దక్కకపోవచ్చు.., కారుకి మేయర్ పీఠం ఈజీగా దక్కేయొచ్చు.. కానీ బీజేపీ బలం పెరగడం.., టీఆరెస్ భవిష్యత్తుకి గండి కొట్టే అంశమే. కేటీఆర్ కి కుర్చీ ఇచ్చేసి.. జాతీయ స్థాయిలో బీజేపీపై పోరు నడిపించాలి అనుకుంటున్నా కేసీఆర్ కి సొంత ఇలాకాలో కమలాన్ని ఢీకొనడం ఇబ్బందిగా మారింది.
ఇప్పటికి 35 ఖరారైనట్టే..!
2016 ఎన్నికల్లో బీజేపీకి కేవలం నాలుగు స్థానాలు మాత్రమే దక్కాయి. ఆర్కేపురం, బేగం బజార్, ఝాన్సీపురా, గోలిబజార్ స్థానాలు మాత్రమే గెలుచుకుంది. కానీ ఈ రోజు ఫలితాల వెల్లడిలో తొలి రౌంగ్ పూర్తయ్యే సరికి “చైతన్యపురి, జాంబాగ్, జీడిమెట్ల, జూబ్లీహిల్స్, నల్లకుంట, బేగం బజార్, మచ్చబొల్లారం, మల్కాజ్ గిరి, ముషీరాబాద్, మూసాపేట, రామ్ గోపాల్ పేట, రాజేంద్ర నగర్, రామాంతపూర్, లింగోజిపేట, వనస్థలిపురం, సరూర్ నగర్, సైదాబాద్, హబ్సిగూడ, హయత్ నగర్, ఆదిక్ మేట, అత్తాపూర్, అమీర్ పేట, అల్లాపూర్, కేపీహెచ్ బీ, కొత్తపేట, గచ్చిబౌలి, గన్ ఫౌండ్రి, గాంధీ నగర్, గోషా మహల్, గుడి మల్కాపూర్ ప్రాంతాల్లో బీజేపీ ఆధిక్యత ఉంది. ఇది తొలిరౌండ్ మాత్రమే. రెండో రౌండ్ పూర్తయ్యే సరికి తుది ఫలితం రానుంది. వీటిలో కనీసం 35 స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమనేది తేలుతున్న లెక్క. టీఆరెస్ కి ఏ మాత్రం పోటీ లేదు అనుకున్న తెలంగాణ రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం.., ఇప్పుడు మళ్ళీ గ్రేటర్ లో బీజేపీ ఊపు కనిపిస్తుండడం కేసీఆర్ కి చెమటలు పట్టించేదే.
(ఫలితాల సరళి, విశ్లేషణ, పూర్తివివరాలను సాయంత్రం “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేకంగా అందిస్తుంది)