ఏపీలో రాజకీయ వేడి రగులుతోంది. అయితే.. ఈ పోరు రెండు రాజకీయ పార్టీల మధ్య కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థకు మధ్య జరగడం విచిత్రం. ఏపీ సీఎం జగన్ వర్సెస్ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నట్టు సాగుతోంది వ్యవహారం. ఈ నిప్పుల కుంపటికి నిమ్మగడ్డ నిప్పు రాజేస్తున్నారు. మార్చిలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను కరోనా కారణంగా చూపిస్తూ వాయిదా వేశారు నిమ్మగడ్డ. ఇప్పుడు ఆయనే ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతున్నారు. అయితే.. ఇక్కడ ఎస్ఈసీ ముందుకెళ్తున్న తీరు రాజకీయ పార్టీలకు సముచితంగానే ఉన్నా.. ప్రజలు విశ్వసిస్తారా..అనేది ప్రశ్న.
ఎస్ఈసీ–రాజకీయపార్టీల మాట ఇదీ..
ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డను ఆ పదవి నుంచి తొలగించడం, ఆయన కోర్టుకు వెళ్లి తన పదవిని తిరిగి పొందడం తెలిసిందే. ఆ హోదాలో ఎస్ఈసీ ఎన్నికలు జరపాలంటున్నారు. ఇందుకు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. దీనిపై ప్రభుత్వం హైకోర్టులో ఎన్నికల కమిషన్ పై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మీటింగ్ ను నిలువరించాలని. అయినా.. సమావేశం జరిగింది. అందరూ ఎన్నికల కమిషనర్ మాటగానే ఎన్నికలు నిర్వహించాలనే అంటున్నారు. అయితే ప్రభుత్వం ఘాటుగానే స్పందిస్తోంది. ‘ప్రభుత్వ నిర్ణయం తెలుసుకోకుండా గతంలో ఎన్నికలు రద్దు చేసిననప్పుడు రాజకీయ పార్టీలు ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకోకుండా ఎన్నికలు ఎస్ఈసీ ఎలా రద్దు చేశారు?’ అని ప్రశ్నిస్తోంది.
ప్రభుత్వం ప్రశ్నలకు సమాధానమేది..
‘ప్రభుత్వంపై కోర్టులకు వెళ్లి, హోటళ్లలో టీడీపీ నేతలను కలుస్తున్న అధికారిని మేము విశ్వసించలేం. పదుల సంఖ్యలో కరోనా కేసులు ఉన్నప్పుడు ఎన్నికలు వాయిదా వేసి.. ప్రస్తతం వేలల్లో కేసులు ఉన్నప్పుడు ఎలా ఎన్నికలు నిర్వహిస్తామంటారు? ఇందులో రాజకీయ కోణం ఉందనే అనుమానం వస్తోంది. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా పార్టీల అభిప్రాయం తీసుకోవడమేంటి’ అంటూ వాదిస్తోంది. ఈ విషయంలో ఎస్ఈసీ-పార్టీల అభిప్రాయం కంటే ప్రజాభిప్రాయం ముఖ్యం. గడచిన కాలంలో జరిగిన తీరు చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీల రాజకీయ కోణాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలను పరిశీలిస్తున్న ప్రజలు ఎప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలొచ్చినా తీర్పునిచ్చేందుకు సిద్ధం. మరి ఎవరి మాట గెలుస్తుందో చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?