నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకొని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానాన్ని పొందారు. సాధారణంగా ఎన్నికల సమయంలో మినహా సాధారణ సమయాల్లో ఎన్నికల సంఘం గురించి ఎవరూ అంతగా పట్టించుకోరు. ప్రభుత్వానికి, ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు ఎన్నికల అధికారులతో పని కూడా ఉండదు. కాకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ప్రక్రియ మధ్యలో అంటే నామినేషన్ ల స్వీకరణ తరువాత అర్ధాంతరంగా ఎన్నికల ప్రక్రియ ను వాయిదా వేయడం, అదీ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకపోడం సీఎం వైఎస్ ఆగ్రహానికి కారణం అయ్యింది.
వైసీపీ స్వీప్ అనుకుంటున్న తరుణంలో..
స్థానిక ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసే పరిస్థితి ఉండటం, నామినేషన్ ల ఘట్టం ముగిసే సమయానికే పలు జిల్లాల్లో అధికార వైసీపీ ఏకగ్రీవాలు నమోదు చేసుకోవడం అందరికీ తెలిసిందే. ఈ తరుణంలో ప్రభుత్వం నుండి గానీ, ప్రతి పక్షాల నుండి గానీ ఎన్నికల వాయిదాపై ఎటువంటి డిమాండ్ లేకపోయినా ఏకపక్షంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కరోనా సాకుగా చూపి స్థానిక ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయడం వివాదాస్పదం అయ్యింది. ఎన్నికల వాయిదా పై రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్ఈసీ చర్చించక పోవడం తప్పేనని అందరూ అన్నారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో ఎస్ఈసీ వ్యవహారం హైకోర్టు, సుప్రీం కోర్టు వరకు వెళ్లడం, చివరకు హైకోర్టు ఆదేశాలతో తిరిగి నిమ్మగడ్డ ఎస్ఈసీ చైర్ లో కూర్చోవడం జరిగింది.
ఎన్నికల ప్రక్రియ రద్దుకు ఎస్ఈసీ అడుగులు
నిమ్మగడ్డ తిరిగి ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టడంతో ఎన్నికల ప్రక్రియను ఏమి చేయనున్నారు? వైసీపీ ప్రభుత్వం అయనపై కత్తి కట్టినందున ఏకగ్రీవంగా అయిన ఎన్నికలను రద్దు చేస్తారా? అందుకు ఆయనకు హక్కు ఉందా? రద్దు చేయడానికి అవకాశం ఉందా? అనే అనుమానాలు రాజకీయ వర్గాల నుండి వినవస్తున్నాయి. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేయడానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ సుముఖంగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అందుకు తగిన అవకాశాలు కూడా ఆయనకు లభించాయి. ఈ నెల 20వ తేదీ లోగా స్థానిక ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని రద్దు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రద్దుకు అవకాశం ఎలా అంటే?
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబందించి సంస్కరణలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఆర్డినెన్స్ -2 జారీ చేసింది. డానికి అనుగుణంగానే ఎస్ఈసీ నిమ్మగడ్డ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసారు. ఆర్డినెన్స్ కాలపరిమితి ఆరు నెలలు. ఈ లోగా అది ఆమోదం పొందకపోతే ఆర్డినెన్స్ కాలం చెల్లినట్లు అవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ కు ఆధారమైన ఆర్డినెన్స్ కు కాలం చెల్లిపోనుండటంతో ఎస్ఈసి నిమ్మగడ్డ దీనిపై ఏమి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం మారింది.