Local Elections ; పంచాయతీలు ముగిసాయి. పురపాలికలు ముగిసాయి. ఇంకా మిగిలి ఉన్నదీ పరిషత్ ఎన్నికలు మాత్రమే. ఇవి కూడా అయిపోతే ఓ పనైపోతుంది. ఎన్నికలు అనే గోల ఉండదు. అధికారిపై ఒత్తిడి ఉండదు. పోలీసులకు కాస్త స్వాంతన ఉంటుంది. అందుకే పనిలో పనిగా ఈ నెలలోనే ఇవి పెట్టేయాలని ప్రభుత్వం అనుకుంటుంది.. కానీ ఇక్కడ కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. ఈ నెలలో పరిషత్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందా..!? దీనికి అవకాశాలు, అవరోధాలు పరిశీలిస్తే..!!
Local Elections ; నాటి ఏకగ్రీవాలె పెద్ద అడ్డంకి..!
గత ఏడాది ఎక్కడ ఆగాయి అక్కడి నుండి మున్సిపల్ ఎన్నికలను కొనసాగించారు. సో.. ఇబ్బంది లేకుండా సాగిపోయాయి. కానీ పరిషత్ ఎన్నికలను అలా కొనసాగించడానికి లేదు. అలాగే కొనసాగిస్తే అప్పుడు ఏకగ్రీవం అయిన 24 ఎంపీటీసీ స్థానాలను కాకుండా మిగిలిన స్థానాల్లో ఎన్నికలు జరపాలి. కానీ ఆ ఏకగ్రీవాలు అన్నీ వివాదాస్పదం అనీ, అక్రమం అనీ, అన్యాయం అని సాక్షాత్తు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గతంలో కోర్టులో అఫడవిట్ వేశారు. అందుకే తానే “అన్యాయం, అక్రమం, తప్పుడు ఏకగ్రీవాలు” అని చెప్పినవి… మళ్ళీ తానే వాటిని రద్దు చేయకుంటే ఇబ్బందులు తప్పవు. పోనీ వాటిని రద్దు చేసేసి, ఫ్రెష్ గా చేయాలని అనుకున్నా ప్రభుత్వం ఊరుకోదు. నాడు ఏకగ్రీవం అయిన 24 శాతం మంది కోర్టులకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ వివాదం చిన్నది కాదు. ఇది తేలితేనే పరిషత్ ఎన్నికలపై ముందడుగు పడుతుంది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది. హైకోర్టు ఎవరికీ అనుకూలంగా/ వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన ఏదో ఒక పక్షం సుప్రీం కోర్టుకి వెళ్లడం ఖాయమే. అక్కడి నుండి తీర్పు రావడం.. ఈ పదిహేను రోజుల్లో ఎన్నికలు మొత్తం జరిపించేయడం కష్టమే..!
కోర్టు తీర్పు రేపు..!? ప్రకటన కూడా..!?
ఈ నేథ్యంలోనే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. నాడు ఏకగ్రీవాలు అయిన స్థానాలపై మధ్యేమార్గంగా వ్యవహరించి… అంటే కొన్నింటిపై మాత్రమే పిర్యాదులు తీసుకుని, విచారణ చేసి.. మిగిలినవి అలాగే కొనసాగిస్తే ఇరు పక్షాలకు ఇబ్బంది ఉండదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే ఆ నిర్ణయం తీసుకుని… మరీ తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చిన స్థానాలపై విచారణ చేసి.. మిగిలిన చోట పోలింగ్ పెట్టేస్తే బాగుంటుంది అని కొందరు సూచిస్తున్నారు. ప్రభుత్వానికి కూడా ఈ ఆలోచనకి సిద్ధంగానే ఉంది. అందుకే ఈ నెల 18 నుండి జరగాల్సిన శాసనసభ సమావేశాలను వాయిదా వేసినట్టు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి నోటిఫికేషన్ విడుదల చేసి.., ఈ నెల 24 లేదా 25 తేదీల్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారని ప్రచారం జరుగుతుంది..! ఇది జరగాలంటే ముందు ఈరోజు లేదా రేపు కోర్టు నుండి తుది తీర్పు రావాల్సి ఉంది..!!