అమరావతి, జనవరి 5: ఆంధ్రా ఎదురు తిరిగితే అణిచేస్తాం అనే ప్రధాని మోదీ ధోరణి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని ఎపీ ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై శనివారం ట్విట్టర్లో ఈ విధంగా పోస్టు చేశారు. “ హోదా కోసం నిలదీయం తప్పా? హక్కుల పరిరక్షణ కోసం కేంద్రంపై పోరాటం చేయ్యడం నేరమా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బీజేపీ నాయకులు అసభ్య పదజాలంతో తిడుతుంటే సుదీర్ఘ అనుభవం ఉండి, దేశానికి పెద్దన్నగా ఉండాల్సిన ప్రధాని మోదీ నవ్వుతూ ఆస్వాదించడం దేనికి సంకేతం” అని లోకేష్ ప్రశ్నించారు.
దేశం కోసం ప్రధాని విదేశీ పర్యటనలు ముఖ్యమైనట్లు, రాష్ట్ర భవిత కోసం సీఎం విదేశీ పర్యటనలూ ముఖ్యమేనన్నారు. ఎపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ పర్యటనపై ఆంక్షలు విధించిన కేంద్రం ప్రధాని విదేశీ పర్యటనలపై కూడా షరతులు ఏమైనా పెట్టిందా ? అని ప్రశ్నించారు.