తెలుగుదేశం పార్టీ కొన్ని సందర్భాల్లో వ్యవహరించే తీరు, తీసుకునే నిర్ణయాలు, చేసే కామెంట్లు ఆ పార్టీ నేతలకు ఎలా ఉంటాయో తెలియదు కానీ రాజకీయ విశ్లేషకులకు మాత్రం నవ్వు తెప్పించే విధంగా ఉందంటున్నారు.
తాజాగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన గురించి, రాష్ట్రంలోని వివిధ సంఘటలను ఉదహరిస్తూ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు చేసిన కామెంట్లను గురించి ప్రస్తావిస్తూ టీడీపీ నేతలు చేసిన డిమాండ్ ఇదే భావనను కలిగిస్తోంది.
అమరావతి గురించి ఏమన్నారంటే….
టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక గొప్ప నగరాలకు ధీటుగా గత ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని తలపెట్టిందని దివ్యవాణి తెలిపారు. “చంద్రన్న పాలనలో ఆకాశాన్నంటే భవనాలు అక్కడ భూమిని చీల్చుకొని మొలిచాయి. సీడ్ యాక్సెస్ రోడ్లు రాజధానికి మణిహారాల్లా నిలిచాయి. అటువంటి నగరం ప్రభుత్వం మారగానే మౌనంగా రోదిస్తోంది. మూడు రాజధానుల నిర్ణయంతో భావితరాల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. పాలకుల నిర్ణయానికి వ్యతిరేకంగా, రాయపూడి రోడ్డెక్కితే, తుళ్లూరు తుళ్లిపడింది. బోరుపాలెం బోరున విలపిస్తుంటే, అనంతవరం ఆగ్రహిస్తే, ఉద్ధండరాయుని పాలెం ఉడుకెత్తుతోంది. రాజధాని కోసం రైతులు చేసిన త్యాగాలను రోడ్డెక్కించేలా మూడు రాజధానులనే నిర్ణయం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్నారు“అని ఆరోపించారు.
లోకేష్ సత్తా ఏంటో తెలుసా?
ప్రజల ఓటు విలువ తెలియాలంటే, ముఖ్యమంత్రి తక్షణమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు. “పెట్రోల్ డీజిల్ పై రూ.500కోట్ల భారం వేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో రూ.1000కోట్లవరకు ప్రజలనుంచి వసూలుచేస్తున్నారు. రాష్ట్రానికి ఎన్నిసమస్యలున్నా, చంద్రబాబు ఏనాడూ ప్రజలపై వీసమెత్తు భారం వేయలేదు. వరద బురదలో పడిపోయే ట్రాక్టరుని ఆపిన సత్తా ఉన్న నాయకుడు లోకేశ్, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం పడుకోబెట్టిన రాజధానిని తిరిగి ప్రపంచం మెచ్చేలా నిలుచోబెట్టే సమర్థుడు కూడా ఆయనే. శిరోముండనం బాధితుడి మాదిరే, అమరావతి రైతులు తాము కూడా నక్సలైట్లలో చేరతామని రాష్ట్రపతికి లేఖలు రాస్తే, ఏపీలో రాష్ట్రపతి పాలన విధించడం ఖాయమని పాలకులు గ్రహిస్తే మంచిది.“ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.