(మచిలీపట్నం నుండి “న్యూస్ అర్బిట్” ప్రతినిధి)
కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో శుక్రవారం దారుణ సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ నాయకుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ అచ్చాబా కుమారుడు ఖాదర్ బాషాను సజీవ దహనం చేశారు.
ఖాదర్ బాషా ఇంట్లో ఉన్న సమయంలో అతని ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. తీవ్రంగా గాయపడిన ఖాదర్ బాషాను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హుటాహుటిన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖాదర్ బాషా మృతి చెందారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై భిన్న వాదనలు వినబడుతున్నాయి. ప్రత్యర్థులు ఎవరైనా ఈ దారుణానికి పాల్పడ్డారా లేక కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగిందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఖాదర్ బాషా కుటుంబ సభ్యుల నుండి పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈ ఘటన మచిలీపట్నంలో తీవ్ర కలకలాన్ని సృష్టించింది.