(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడటంతో ఒక పక్క రచ్చ జరుగుతుండగా, మహారాష్ట్రలో మూడు నెలల పాటు అన్ని రకాల ఎన్నికలు వాయిదా వేయాలని నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా పశ్ఛిమబెంగాల్ లో పురపాలిక ఎన్నికలు కూడా వాయిదా వేయాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల వాయిదాకు అక్కడి ప్రతిపక్షాలు సుముఖత వ్యక్తం చేశాయి.
ప్రపంచాన్ని గడగడ లాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా అన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యలు పాటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్ లో ‘కరోనా’ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా చర్యలు చేపడుతున్నారు. విద్యా సంస్థలు, పలు సాఫ్ట్ వేర్ సంస్థలు, సినిమా థియేటర్స్, మాల్స్ ఇప్పటికే మూసివేశారు. బాలీవుడ్, టాలీవుడ్ లలో షూటింగ్స్ కూడా రద్దు చేశారు. ‘కరోనా’ కారణంగా ఏపీలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలు ఆరు వారాలు వాయిదాపడ్డాయి. ఎన్నికలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం విచారణ జరగనున్నది. తాజాగా మహారాష్ట్ర లో నాలుగు కరోనా కేసులు వెలుగు చూశాయి. ఈ నేపథ్యంలో అక్కడి ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా మహారాష్ట్రలోని పుణెలో 144 సెక్షన్ అమలు చేస్తుండటం గమనార్హం.