సుదీర్ఘ విరామం అనంతరం తెలంగాణలో మళ్లీ మావోయిస్టుల కదలికలు కనిపిస్తున్నాయి.రెండు రోజుల క్రితం మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురం (నూగూర్) మండలం అలుబాకకు చెందిన తెరాస నాయకుడు భీమేశ్వరరావును హత్య చేయడమే కాకుండా తమ కోసం గాలింపు చర్యలు ఆపకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ వాల్ పోస్టర్లు అంటించారు.
ఏటూరునాగారం, భూపాలపల్లి ఏరియా కమిటి, ఉంగా పేరుతో గోడ పత్రికలు అంటించారు. షాపల్లి గ్రామంలో మావోల పేరుతో అంటించిన గోడపత్రికలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.ఈ లేఖలో మావోలు కెసిఆర్ ప్రభుత్వ పాలసీలను కూడా తప్పుబట్టారు.కేసీఆర్ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం పేరుతో చేసేదేమీ లేదన్నారు. ప్రజలు సమస్యలు పరిష్కరించమని అడిగితే అక్రమ అరెస్టులు చేయిస్తున్నాడన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని పెంచుతూ ప్రజలపై అక్రమ కేసులు పెడుతూ వారిని కేసీఆర్ బలి చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.ఇదే విధానాలు కొనసాగితే శిక్షలు తప్పవని హెచ్చరించారు.అంతేగాక అణిచివేత విధానాలకు పాల్పడుతున్న అటవీ శాఖాధికారులు ప్రహ్లాదు , రవీందర్ ,సందీప్ తమ ప్రవర్తన మార్చుకోవాలని లేకపోతే ప్రజలే శిక్షిస్తారని మావోలు వార్నింగ్ ఇచ్చారు.
మాజీ మావోయిస్టు సంపత్ పోలీసులకి అన్నివిధాలా సాయపడుతున్నాడని,వారిని తన సొంత వాహనాల్లో తిప్పుతున్నాడని.. ఇందుకు త్వరలోనే మూల్యం చెల్లించుకుంటాడని మావోలు హెచ్చరించారు.అయితే మావోలు ఒక్కసారిగా నేరుగా రంగంలోకి రావడానికి వెనుక కొంచెం కథ నడిచింది.కరోనా లాక్ డౌన్ సమయంలో తెలంగాణ అడవుల్లో మావోలు బలపడ్డారు.ఈ సమయంలో వారు పెద్దఎత్తున రిక్రూట్మెంట్ కూడా నిర్వహించారు.అయితే కేంద్ర నిఘావిభాగం ఈ విషయాన్ని పసిగట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.ఈ క్రమంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఎనిమిది మంది మావోయిస్టులు ఒకే నెలలో మరణించారు.ఆదివాసీలే పోలీస్ ఇన్ఫార్మర్లుగా మారి తమను పట్టిస్తున్నారని మావోయిస్టులు భావించి ఇరవై అయిదు మంది ఆదివాసీలను మట్టుపెట్టారు.దీన్ని సవాలుగా భావించిన కేంద్ర హోం శాఖ సీనియర్ భద్రతా సలహాదారు కె విజయ్ కుమార్ నాలుగు రాష్ట్రాల పోలీసు అధికారులతో మావోయిస్టుల కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు జాయింట్ యాక్షన్ ప్రోగ్రాం ను ఏర్పాటు చేశారు.
దీనిలో భాగంగానే ఈనెల 4న కె విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మూడు హెలికాప్టర్లలో పోలీస్ అధికారులు ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం చేరుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో సమావేశమయ్యారు. ఇది జరిగి సరిగ్గా వారం తిరగకముందే శనివారం రాత్రి… పోలీస్ అధికారులతో విజయ్ కుమార్ సమావేశం నిర్వహించిన నూగూరు వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉన్న అలుబాక గ్రామంలో తెరాస నాయకుడిని మావోలు హత్య చేశారు.వెనువెంటనే హెచ్చరికల వాల్పోస్టర్లు అంటించారు .దీంతో మళ్లీ తెలంగాణలో యుద్ధ వాతావరణం అలుముకుంటున్న సూచనలు గోచరిస్తున్నాయి.