లక్నో, జనవరి 12: ఉత్తరప్రదేశ్లో బిఎస్పి, ఎస్పి పొత్తు నూతన సంవత్సరంలో కొత్త రాజకీయ విప్లవానికి నాంది అవుతుందని బిఎస్పి అధినేత్రి మాయావతి అన్నారు. లక్నోలో శనివారం మాయావతి, సమాజ్వాది పార్టీ నేత అఖిలేష్ సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ పొత్తు రెండు పార్టీల రాజకీయ ప్రయోజనాల కోసం కాదనీ, ఎస్సి, ఎస్టి, మైనార్టీల ప్రయోజనాల కోసమేనని మాయావతి స్పష్టం చేశారు.
నేడు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోవడం జాతీయ అనివార్యత అని అమె అన్నారు. ఉప ఎన్నికల స్ఫూర్తితో రానున్న ఎన్నికల్లో బిజెపికి బుద్ది చెప్పాలని అనుకుంటున్నాం. బిజెపికి సమాధానం చెప్పే దిశగా ఇది ఒక చరిత్రాత్మక సమావేశం అని ఆమె పేర్కొన్నారు. ఒక చారిత్రాత్మక అవసరమే ప్రాతిపదికగా, దేశ ప్రజల ప్రయోజనాల కోసం ఒక కూటమిగా ఏర్పడుతున్నామని మాయావతి చెప్పారు.
ఈ సమావేశంతో ఇక మోదీ, షాలు నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని అమె అన్నారు. కాంగ్రెస్, బిజిపి రెండూ కూడా అవినీతిలో కూరుకుపోయాయని అన్నారు.
పొత్తుకు అంగీకరించిన మాయావతికి అఖిలేష్ ధన్యవాదాలు తెలియజేస్తూ దేశంలో పేదలు, మైనార్టీలపై జరుగుతున్న దాడులకు లెక్కేలేకుండా పోయిందని అన్నారు. యుపిలో కాంగ్రెస్కు బలం లేదని చెప్పారు. కోట్ల మంది ప్రజలు కేంద్రంలోని బిజెపిపై అసంతృప్తిగా ఉన్నారని అఖిలేష్ అన్నారు.
రాష్ట్రంలో అమేధీ, రాయ్బరేలీ నియోజకవర్గాలను కాంగ్రెస్కు వదిలివేసి బిఎస్పి 38,ఎస్పి 38 స్థానాల్లో పోటీ చేస్తుందని వారు ప్రకటించారు.