మీడియా విలువలు పడిపోతున్నాయి. పత్రికలు పూర్తిగా దిగజారుతున్నాయి. తలో పార్టీ చెంగు పట్టుకుని, చీర చుట్టుకుని పూత పూసుకుంటున్నాయి. ఇక తెలుగునాట పత్రికల పరిస్థితి చెప్పే పని లేదు. సాక్షి పత్రిక పుట్టడమే పార్టీ కోసం, నాయకుడి కోసం పుట్టింది. అందుకే జర్నలిజం, పత్రికల్లో దాన్ని కాసేపు పక్కన పెడదాం. మాటిమాటికీ విలువలు, ఆదర్శం, మేము గొప్ప అంటూ ఊదరగొట్టుకునే ఈనాడు, ఆంధ్రజ్యోతిల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
తాజాగా మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలను దురుద్దేశం పూర్వకంగా రాసి ఈనాడు పెద్ద తప్పులో కాలేసింది. ఈరోజు ఆ పత్రిక మొదటి పేజీలో ప్రచురితమైన “అవసరమైతే ఎన్డీఏలో చేరుతాం” అనే వార్తపై మంత్రి బొత్స ఓ ఘాటైన లేఖని ఈనాడు అధినేత రామోజీకి రాశారు. ఈ లేఖలో ఈనాడు దురుద్దేశాన్ని వివరించారు. ఈనాడు ఎంత దిగజారిందో వివరిస్తూ రాశారు. ముఖ్యంగా ” ‘‘అవసరమైతే ఎన్డీయేలో చేరతాం’’అని నేను అన్నట్టుగా మీరు హెడింగ్ పెట్టారు. నేను ఆ మాటలు ఎక్కడ అన్నానో చూపించండి. ఈ హెడింగ్ పెట్టటం ద్వారా రెండు వైపులా పదునున్న కత్తిని మాకు వ్యతిరేకంగా వాడాం అని మీరు మురిసిపోతున్నట్టున్నారు. మొదటిది– నేను అనని ఈ మాటల్ని అన్నానని చెప్పటం ద్వారా, పూర్తిగా మా మీద నమ్మకంతో ఉన్న మైనార్టీలను రెచ్చగొట్టాలన్నది మీ దురాలోచన.
రెండోది– ఈ వ్యాఖ్యలు మేం చేయలేదని ఖండిస్తే… కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బ కొట్టవచ్చన్నది మీ రెండో దురాలోచన. అంటూ రామోజీకి సూటిగా రాశారు. దీనిపై పత్రిక స్పందన చూసుకుని తన చర్యలు ఉంటాయని పరోక్షంగా హెచ్చరించారు. “నా వ్యాఖ్యల వీడియో పంపిస్తున్నాను. ఎందుకు ఇంతగా దిగజారుతున్నారు? తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు, చంద్రబాబు ప్రయోజనాలు, మీ అందరి ఉమ్మడి ప్రయోజనాల కోసం అబద్ధాలు, కట్టుకథలతో ఇంకెంత కాలం మీ పత్రిక నడుపుతారు? చంద్రబాబు పర్సనల్ సెక్రెటరీ తీగ లాగుతుంటే కదులుతున్న వేల కోట్ల రూపాయల అవినీతి డొంకను మీరెందుకు చూపించటం లేదు? ఇలాంటి వార్తల్ని దాచటం కూడా పత్రికా విలువల్లో భాగమేనా? ఇందులో జాతీయ ప్రయోజనాలు ఏమన్నా ఇమిడి ఉన్నాయా? చంద్రబాబుకు 70. మీకు 84. పండు వయసు వచ్చినా రాష్ట్రం గురించి కంటే మీ స్వప్రయోజనాల కోసమే రగిలిపోతున్న మీ వైఖరి వల్ల రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మీ పాజిటివ్ కంట్రిబ్యూషన్ ఏమిటంటే చెప్పుకునేందుకు ఏమీ లేని పరిస్థితి తెచ్చుకున్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పేరు చెపితే గుర్తుకు వచ్చే ఒక్క స్కీమూ లేదు… ఈనాడు పత్రిక వల్ల తెలుగు ప్రజలకు జరిగిన మేలు ఫలానా అంటే చెప్పేందుకూ ఏమీ మిగల్లేదు. ఎందుకీ పరిస్థితి వచ్చిందో మీరే ఆలోచించుకోండి.” అంటూ నేరుగా రామోజీకి బహిరంగ లేఖ రాసి ఈనాడు ఉద్దేశాన్ని ఎండగట్టారు.