అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రతిపక్షానికి అవసరం లేదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధాని, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సోమవారం వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా విశాఖ రాజధానిగా కావాలని ఎవరడిగారని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు అయి ఉండి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదని విమర్శించారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలన్నారు. స్పీకర్ గురించి కూడా విపక్ష సభ్యులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని… గౌరవంగా మాట్లాడాలని మండిపడ్డారు. టీడీపీ వాళ్లలా హత్యలు చేసి తాము అసెంబ్లీకి రాలేదని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. ‘ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రతిపక్షానికి అవసరం లేదా?.. రాయలసీమకు హైకోర్టు వద్దని చెప్పగలరా?’ అని ప్రశ్నించారు. విశాఖలో తనకు ఒక్క ఎకరా ఉన్నట్టు నిరూపించగలరా?.. అందరూ చంద్రబాబులా ఉంటారని అనుకుంటే ఎలా? అని మంత్రి మండిపడ్డారు. తాను భూములు కొంటే ఐదేళ్లు చంద్రబాబు ఏం కట్టుకుని కూర్చున్నారని ప్రశ్నించారు. ఇసుకలో దోపిడీ లాంటివి తమకు తెలియదని మంత్రి బొత్స చెప్పారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?