విజయవాడ: నీటి పారుదల శాఖలో ఐదేళ్లు అవినీతికి, అరాచకాలకు పాల్పడ్డారంటూ వైసిపి నేత విజయసాయిరెడ్డి ఆరోపణలు చేయడంపై మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. విజయసాయిరెడ్డికి ధైర్యం ఉంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడాలని ఉమా సవాలు విసిరారు.
నాలుగు వారాలు ఓపిక పడితే అన్నీ బయటపడతాయని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై విజయవాడ టిడిపి కార్యాలయంలో ఉమా మీడియా సమావేశం నిర్వహించారు. అధికారులు, గుత్తేదారులు తమకు దస్త్రాలు తెచ్చి ఇస్తున్నారంటూ విజయసాయిరెడ్డి చెబుతున్నారనీ, తమ సంగతి చూస్తానంటూ బెదిరింపు ధోరణిలో వ్యాఖ్యలు చేస్తున్నారనీ ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంటే అతని బెయిల్ రద్దు కావడం ఖాయమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగేతర శక్తిగా విజయసాయిరెడ్డి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ఉమా దుయ్యబట్టారు.
2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 11,273 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని ఉమా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా 4,546 కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నా వాటి గురించి ప్రతిపక్ష పార్టీ ఒక్కసారి కూడా మాట్లాడలేదని ఉమా విమర్శించారు. అవినీతిలో కూరుకుపోయిన వారు పోలవరంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఉమా ఎద్దేవా చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అనేక అవార్డులు వచ్చిన విషయాన్ని ఉమా గుర్తు చేశారు. పులివెందులకు నీళ్లు ఇచ్చినా వైసిపి అధ్యక్షుడు జగన్ ఏనాడు స్పందించకపోవడం దారుణమని ఉమా అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాస్తే వైసిపి నేతలకు ఉలుకు ఎందుకని ఉమా ప్రశ్నించారు. జగన్,విజయసాయిరెడ్డిలకు ప్రజా క్షేత్రంలో తిరిగే అర్హత లేదనీ, వీరు ఉండాల్సింది తీహార్ జైలులోనేనని ఉమా ఎద్దేవా చేశారు.
మరో 4 వారాలు ఓపిక పట్టు ఉమా. ఇరిగేషన్ శాఖలో ఐదేళ్లుగా నువు సాగించిన అరాచకం అంతా బయటకొస్తుంది. అధికారులు, బాధితులైన కాంట్రాక్లర్లు నీ దోపిడీ వ్యవహారాల ఫైళ్లను స్వచ్ఛందంగా తెచ్చిస్తున్నారు. పోలవరం, హంద్రీ-నీవాల్లో రెండేళ్లలోనే వందల రెట్లు అంచనాలు పెంచింది నిజం కాదా?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 26, 2019