కరోనా నేపథ్యంలో గ్రామాలు, పట్టణాలు ప్రశాంతంగా ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఎటువంటి ఎన్నికలు లేవు. కానీ రాజకీయ నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలు, అక్కడక్కడా ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లాలో ఒక మంత్రి, మాజీ మంత్రి మధ్య జరుగుతున్న విమర్శలు, ప్రతి విమర్శల యుద్ధం తారా స్థాయికి చేరుకుని వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారు. గతంలో రాజకీయ నాయకుల మధ్య విధానపరమైన అంశాలపై విమర్శలు దానికి సమాధానాలు ఇచ్చుకోవడం జరిగేది. హుందాతనంతో రాజకీయ నాయకులు వ్యవహరించే వారు. నాడు ఒక వేళ ఏ రాజకీయ నాయకుడైనా పరుష పదజాలంలో ప్రత్యర్థి పార్టీపై విమర్శలు చేస్తే మీడియాలో వాటిని ప్రచురితం చేయకుండా పత్రికలో రాయలేని విధంగా అంటూనో లేక పరుష పదజాలంతో దూషించారనో విమర్శించారనో రాసేవారు. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు వారి స్థాయిలను మరచిపోయి ప్రత్యర్థులపై దూషణ పర్వానికి దిగడం, అవి పత్రికల్లో, మీడియాలో రావడం కూడా జరుగుతోంది.
కృష్ణాజిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, టిడిపి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుల మధ్య ఇటీవల విమర్శలు, ప్రతివిమర్శల యుద్ధం తారా స్థాయికి చేరి నీవేంటి, నీబ్రతుకేంటీ అన్న స్థాయిలో సాగడం సామాన్య ప్రజలు విస్తూపోయేలా చేస్తున్నది. ఆయా పార్టీల క్యాడర్ లు మాత్రం ఇది విన సొంపుగానే ఉంటోంది. కొడాలి నానిని ఉద్దేశించి దేవినేని ఉమా వాడొక బూతుల మంత్రి. తనకు రాజకీయ బిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు, సన్న బియ్యం ఇస్తానని చెప్పి ఇవ్వలేకపోయిన సన్నాసి ఎదవ మంత్రి అంటూ విమర్శించారు. దీనిపై మంత్రి కొడాలి తీవ్రంగా స్పందిస్తూ చంద్రబాబు నాయుడే ఒ పెద్ద బిచ్చగాడు. ఆయన తనకు రాజకీయ బిక్ష పెట్టడమేమిటి, తనకు రాజకీయ బిక్ష పెట్టింది ఎన్ టి రామారావు, హరికృష్ణ, జూనియర్ ఎన్ టిఆర్ అంటూ ఉమాపై ఫైర్ అయ్యారు. దేవినేని నీ బతుకు ఎవరికి తెలియదు. కంచికచర్లలో సోడాలు అమ్మలేదా, నీవు ఏమైనా మైసూరు మహారాజువా, పై నుండి ఊడిపడ్డావా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతి సారి లారీ క్లీనర్, డైవర్, బూతుల మంత్రి అంటున్నావు ఎవరో ఒక లారీ డ్రైవరో క్లీనరో హైవేపై తొక్కిస్తారు జాగ్రత్త అంటూ హెచ్చరించారు నాని. ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేస్తే లారీలతో తొక్కిస్తామని బెదిరిస్తారా అని ఉమా ప్రశ్నించారు. బూతుల మంత్రి అంటే ఎవరో రాష్ట్రంలో అందరికీ తెలుసునని ఉమా విమర్శించారు. మరో సారి బూతుల మంత్రి అంటే ఇంటికొచ్చి మరీ కొడతానంటూ దేవినేనిని నాని హెచ్చరించారు.
కొడాలి నాని, దేవినేని ఉమామహేశ్వరరావు మధ్య వైరం ఇప్పటిది కాదు. గతంలో కొడాలి టిడీపీలోనే ఉన్నారు. నాడు కూడా ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు లేవు, కొడాలి టిడిపి రాజకీయాలలో ఇమడలేక వైసిపిలో చేరారు. అప్పటి నుండి కూడా కొడాలి అనేక పర్యాయాలు టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, దేవినేని ఉమామహేశ్వరరావుపై వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేయడం జరుగుతూనే ఉంది. నాయకులు ఈ రేంజ్ లో విమర్శలు, దూషణలు చేసుకుంటుండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా వ్యక్తిగత దూషణలకు పాల్పడటం అంత మంచిది కాదని, సమాజంలో నేతలు హుందా తనంతో వ్యవహరిస్తేనే ప్రజలు హర్షిస్తారని అంటున్నారు.