Tirupati by poll: తిరుపతి ఉప ఎన్నిక Tirupati by poll రాష్ట్రాన్ని హీటెక్కిస్తోంది. నాయకులంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ-జనసేన పార్టీలు తమ శక్తివంచన లేకుండా గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. అగ్ర నాయకులంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. బీజేపీ-జనసేన నుంచి పవన్ కల్యాణ్ ప్రచారం చేసి వెళ్లారు. టీడీపీ నుంచి ప్రస్తుతం చంద్రబాబు, లోకేశ్ అక్కడే మకాం వేసి ప్రచారం హోరెత్తిస్తున్నారు. వైసీపీ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ప్రచారం చేస్తున్నారు. 14న సీఎం జగన్ ప్రచారానికి రవాల్సి ఉండగా క్యాన్సిల్ అయింది. ప్రచారంలో భాగంగా నేతల సవాళ్లు.. ప్రతిసవాళ్లు జరుగుతున్నాయి. ఈక్రమంలో చంద్రబాబు చేసిన ఓ సవాల్ ను మంత్రి పెద్దిరెడ్డి అంగీకరిస్తూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు.
చంద్రబాబు ప్రచారంలో వైసీపీకి సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ ఓడిపోతే.. మీ ఎంపీలు అందరూ రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. దీనికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. చంద్రబాబు సవాల్ ను స్వీకరిస్తూ ప్రతి సవాల్ విసిరారు. వైసీపీ ఓడిపోతే మా ఎంపీలంతా రాజీనామా చేస్తారు.. మీరు ఓడిపోతే మీ ముగ్గురు ఎంపీలతోపాటు రఘురామకృష్ణ రాజుతో కూడా రాజీనామా చేయిస్తారా? అని ప్రశ్నించారు. దీంతో రెండు పార్టీల మధ్య పొలిటికల్ ఫైర్ మరింత రగిలింది. ఇప్పటికే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని మంత్రి పెద్దిరెడ్డి చాలెంజ్ కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి మధ్యే పొలిటికల్ చాలెంజ్ జరుగుతోంది.
నేతల సవాళ్లు, ప్రతి సవాళ్లు అక్కడికే ఆగిపోతాయని తెలిసిందే. కాకాపోతే.. ప్రజల్లోకి మరింతగా వెళ్లేందుకు ఇవి ఉపయోగపడతాయి. చంద్రబాబు విషయంలో మాత్రం మంత్రి పెద్దిరెడ్డి సై అంటే సై అంటున్నారు. ఇదంతా గెలుపు కోసం పోరాటమే అని ప్రజలకూ తెలుసు. మొత్తంగా రాజకీయంగా కాక రేపుతున్న తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్ధి 5 లక్షల మెజార్టీతో గెలుస్తారని.. తగ్గినా 4లక్షల మెజారిటీ ఖాయమని ఇప్పటికే వైసీపీ నేతలు ప్రకటించారు. గెలిచి పట్టు నిలుపుకోవాలని వైసీపీ, తమ ఉనికి చాటుకోవాలని టీడీపీ, గెలిచి ఏపీలో అడుగు ముందుకేయాలని బీజేపీ-జనసేన భావిస్తున్నాయి. ప్రజలు ఎవరి ఆకాంక్షను నెరవేరుస్తారో వేచి చూడాల్సిందే.