ఒక దశలో ఏపీ సీఎం జగన్ కు అపాయింట్ మెంట్ ఇస్తున్నట్టు ఢిల్లీ పిలిపించుకుని కూడా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కానీ.. రీసెంట్ టైమ్స్ లో.. మూడు నాలుగు నెలల కాలంలోనే అమిత్ షా, జగన్ ల భేటీ మూడు, నాలుగు సార్లు జరిగింది. వ్యవసాయ చట్టాలకు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఏపీ నుంచే భారీ మద్దతు వచ్చిన నేపథ్యంలో అమిత్ షా వద్ద జగన్ కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈమధ్య వరుస భేటీలు జరుగుతున్నాయి. రానా హీరోగా వచ్చిన లీడర్ సినిమాలో ఆహుతి ప్రసాద్ ఓ సన్నివేశంలో.. ‘మా భేటీలో రాజకీయ చర్చలేం జరగలేదు’ అని చెప్తాడు. ఇక్కడా వీరి భేటీలో ఈ మాటను వారు చెప్పకపోయినా మనం వల్లె వేసుకోవాల్సిందే. అయితే.. జగన్ ఢిల్లీ టూర్ వేసినప్పుడల్లా కొత్తకొత్త పరిణామాలు జరుగుతున్నాయని చెప్పాలి.
కేంద్రం పరిశీలిస్తోందా..?
ఈ పరిణామాలు జగన్ కు మేలు చేసేవా.. కాదా అనేది పక్కన పెడితే.. ఈ పరిణామాలు కీలకంగా మారుతున్నాయి. ఇటివల ఏపీలో హిందూ దేవాలయాలపై దాడులు, దేవుళ్ల విగ్రహాలు ధ్వంసం, విగ్రహాల మాయం.. తదితర దారుణమైన ఘటనలతో ఏపీ అట్టడుకుతోంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ విషయాలపై కేంద్రం ఆరా తీసిందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా అంతర్వేదిలో రథం దగ్దం ఘటన, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో వెండి విగ్రహాలు మాయం సంచలనం రేపితే రామతీర్ధంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం రాష్ట్రాన్ని రావణకాష్టం చేసింది. ఈ అంశాలన్నింటినీ కేంద్రం పరిశీలించక మానదు. చెప్పాలంటే ఈ అంశాలన్నింటిలో ఇంతవరకూ పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేక పోయారు. కానీ.. ఇప్పుడు ఈ కేసుల్లో పురోగతి వస్తుందని అంటున్నారు. అది కూడా సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అనంతరం. పోలీసులు చూపించిన ప్రగతే ఇందుకు ఉదాహరణ.
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాతే..
2021 అక్టోబర్ లో అమిత్ షాను జగన్ కలిసిన రెండో రోజున సుప్రీంకోర్టు జడ్జి ఎన్వీ రమణపై ఆరోపణలు చేస్తూ ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు జగన్ లేఖ రాసి బహిర్గతం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిందీ అంశం. డిసెంబర్ లో మళ్లీ వీరిద్దరి భేటీ తర్వాత ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి బదిలీ జరిగింది. ప్రస్తుత భేటీ తర్వాత.. లాక్ డౌన్ లో బెజవాడ కనకదుర్మమ్మ దేవాలయంలో వెండి సింహాలు మాయమైన ఘటనలో ఇప్పటివరకూ నిందితులు పట్టుబడలేదు. కానీ.. ఈ కేసులో ఓ వ్యక్తిని నిందితుడిగా అనుమానించి పట్టుకున్నామని, విచారిస్తున్నామని పోలీసులు ప్రకటించారు. దేవాలయాల్లో దొంగతనాలు చేసిన చరిత్ర ఉన్న ఈ నిందితుడితోపాటు వెండి సింహాల ప్రతిమలు కొనుగోలు చేశాడని భావిస్తున్న బంగారం వ్యాపారిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన దేవాలయాల ఘటనల్లో కూడా పోలీసులు తమ పనిని మరింత వేగం చేసారని తెలుస్తోంది. దీంతోపాటు ఇటివలే సంచలనం రేపిన గుడివాడ ఎస్ఐ విజయ్ కుమార్ ఆత్మహత్య విషయంలో ఆయన ప్రియురాలి పాత్ర ఉందని పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈమె వేధింపుల వల్లే ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు ప్రాధమికంగా తేల్చారు.
లోగుట్టు జగన్ కే ఎరుక..!
రాజకీయంగా చూస్తే.. పల్నాడులో జరిగిన పెదగార్లపాడు మాజీ సర్పంచ్ అంకులు హత్య సంచలనం రేపింది. ఈ హత్య కేసులో కూడా హఠాత్తుగా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ హత్య ఎవరు చేయించారో ఇంకా వెలుగులోకి రాకపోయినా రాజకీయ హత్య కాదని పోలీసులు అంటున్నారు. ఎవరో కావాలనే సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించారని అంటున్నారు. ఇలా వరుస ఘటనల్లో పోలీసులు పలు కేసుల్ని, పలువురు నిందితుల్ని అరెస్టు చూపిస్తూ ముందుకెళ్తున్నారు. అయితే.. వీరి ప్రతి భేటీ అనంతరం జరుగుతున్న పరిణామాలు కేంద్ర హోంశాఖ రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై సీరియస్ అయితే జరుగుతున్నాయా..? లేక తమ ప్రభుత్వం ఈ విషయాల్లో కఠినంగా ఉంది అని అమిత్ షా వద్ద చూపేందుకు జరుగుతున్నాయా..? అనేది రాజకీయంగా ఎదురవుతున్న ప్రశ్నలు. మరి వీటన్నింటికీ సమాధానం సీఎం జగన్ మనుసులోనే ఉంటుందని చెప్పాలి.