ఐజ్వాల్(మిజోరాం), జనవరి 26: గణతంత్ర వేడుకల్లో ప్రజలు లేకుండానే గవర్నర్ ప్రసంగించారు. మిజోరాంలో శనివారం రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్కు ప్రజలు లేకుండానే ప్రసంగించాల్సివచ్చింది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పలు సంస్థలు గణతంత్ర వేడుకలను బహిష్కరించాలని పిలుపునివ్వడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎవ్వరూ పాల్గొనలేదు.
జాతీయ పతాకాన్ని ఎగురవేసిన గవర్నర్ ఖాలీగా ఉన్న మైదానంలో ప్రసంగించాల్సి వచ్చింది. ఈ అధికారిక వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల మాత్రమే పాల్గొన్నారు. సాయుధ దళాలు, పోలీసు బృందాలు పరేడ్లో పాల్గొన్నాయి.
విద్యార్ధి సంఘాల ఐక్యవేదిక బహిష్కరణకు పిలుపునివ్వడంతో జిల్లా కేంద్రాల్లో జరిగిన వేడుకల్లో ప్రజలు హాజరుకాలేదు.
పొరుగుదేశాలనుండి వచ్చిన ముస్లీమేతర మైనార్టీలకు మన దేశ పౌరసత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును ఈనెల ఎనిమిదిన లోక్సభ ఆమోదించింది. దీనిపై ఈశాన్య రాష్ట్రాల ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జోరంతంగ ఈ బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.