హైదరాబాద్ లో రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారిపోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఏకంగా అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. వాదనలు, దూషణలు, హామీలతోపాటు అలకలు కూడా ఈ ఎన్నికల్లో స్పెషల్ గా నిలుస్తున్నాయి. 2016లో ఏకచత్రాధిపత్యం చూపించిన టీఆర్ఎస్ కు ఈసారి ప్రతిబంధకంగా బీజేపీ నిలుస్తోంది. రెండు పార్టీలు నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతున్నాయి. దుబ్బాక దెబ్బతో కుదేలైన టీఆర్ఎస్ ఎదురీదుతుంటే.. అక్కడ విజయం సాధించిన బీజేపీ సై అంటోంది. ఇంత ఉత్సాహంలో ఉన్న బీజేపీకి సొంత పార్టీలోనే ముసలం పుడుతోంది. టికెట్ దక్కలేదని ఇంటి పోరును రచ్చకెక్కిస్తున్నారు.
కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందా..
టికెట్టు దక్కలేదని అసంతృప్తులు ఏకంగా రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనే రచ్చ చేస్తున్నారు. మొదట్లో కూకట్ పల్లి, తర్వాత కుత్భుల్లాపూర్, ఇప్పుడు గన్ ఫౌండ్రీ.. ప్రాంతాల బీజేపీ నాయకులు టికెట్టు దక్కలేదని తమ ఆగ్రహం వెలిబుచ్చారు. కూకట్ పల్లి, కుత్భుల్లా పూర్ నాయకులు స్థానికంగా గొడవ చేసి నాయకులపై విమర్శలు చేస్తే.. గన్ ఫౌండ్రీ నాయకులు ఏకంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలోనే రచ్చ చేశారు. టికెట్ దక్కించుకున్న ఓంప్రకాశ్ వర్గీయులతో శైలేంద్ర యాదవ్ వర్గీయులు కోట్లాడారు. ఆఫీస్ ఫర్నీచర్ ను దారుణంగా ధ్వంసం చేశారు. పార్టీ నాయకులు టికెట్లు అమ్ముకున్నారని నినదించారు. పార్టీలో మొదటినుంచీ కష్టపడిన వారికి కాకుండా టీడీపీ నుంచి వచ్చిన వారికి టికెట్లు ఇచ్చారంటే అగ్ర నాయకులును దూనమాడారు. ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు.
మేల్కోకుంటే.. బీజేపీకి నష్టమే..
తన వర్గానికి టికెట్లు కేటాయించలేదని.. బండి సంజయ్ మోసం చేశారంటూ ఏకంగా ఆడియో రిలీజ్ చేసేశారు. గన్ ఫౌండ్రీ, బేగం బజార్ టికెట్లు తన అనుచరులకు ఇప్పించుకోలేక పోయారని తెలుస్తోంది. నాయకుల ఇష్టారాజ్యంపై జాతీయ నాయకత్వానికి లేఖ రాస్తానని హెచ్చరించారు. 150 డివిజన్లలో తాను ఎక్కడా ఇన్వాల్వ్ కానని స్పష్టం చేశారు. ఇవన్నీ బీజేపీ ఉత్సాహానికి మోకాలడ్డే ఘటనలని చెప్పాల్సిందే. ప్రచారం, గెలుపుపై పెట్టిన శ్రద్ధ అసంతృప్తులను బుజ్జగించే ప్రయత్నాలు చేయడం లేదు. లక్ష్యం నెరవేర్చుకునే ప్రయత్నాల్లో మాత్రమే ఉన్న బీజేపీకి ఇవన్నీ ప్రతిబంధకాలు అవుతున్నాయి. వెంటనే బుజ్జగింపులు చేయకపోతే అధికార పార్టీ ఈ ఘటనలను తనకు అనుకూలంగా మార్చుకోవడం తథ్యం. మరి.. బండి.. బీజేపీ బండిని ఎలా నడిపిస్తారో చూడాలి.