MLA RK Roja: పాపం.. రోజా..! ఏపీలో వైసీపీ తరపున 175 నియోజకవర్గాలూ బాగా తెలిసిన నాయకురాలు ఎవరైనా ఆమె రోజా మాత్రమే. ఆ పార్టీలో, మరీ ముఖ్యంగా మహిళా విభాగంలో ఆమె అంతగా ముద్ర వేశారు. వైసీపీ ప్రభుత్వం వస్తే కచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అనుకునే టాప్ అయిదు పేర్లలో ఆమె కచ్చితంగా ఉండేది. అటువంటిది ఆమెకు 2019లో మంత్రి పదవి దక్కలేదు. ఏపీఐఐసీ కార్పొరేషన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు అది పీకేశారు. ఆ పదవిని మెట్టు గోవర్ధన్ రెడ్డికి ఇచ్చారు. దీంతో రోజాకు మంత్రి పదవి ఇస్తారేమో.., అందుకే నామినేటెడ్ పదవి తీసీశారేమో అనే సందేహాలు చాల మందిలో ఉన్నాయి. కానీ ఒక లాజిక్కు, ఒక విశ్లేషణ, ఒక సూటైన పాయింట్ ప్రకారం ఆమెకు మంత్రి పదవి కూడా దాదాపు అవకాశాలు లేనట్టే..!? ఎందుకంటే…!!
MLA RK Roja: రెండు రకాలుగా రోజాకు మైనస్..!!
రోజాకు మంత్రి పదవి అవకాశాలు లేవు అని చెప్పడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటీ సామాజికవర్గం. రెండూ ఆ జిల్లా..
* రోజా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేత. ఆ సామాజికవర్గంలో ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవర్నీ తొలగించాలన్న జగన్ కి తలనొప్పులు తప్పవు. ఒకరు బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కి బంధువు.. రెండో వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అత్యంత సీనియర్.. జిల్లాలో ఆపరేషన్ టీడీపీ, ఆపరేషన్ కుప్పం సమర్ధవంతంగా అమలు చేస్తున్నారు. చంద్రబాబుని సొంత జిల్లాలో బలహీనం చేసే మహత్తరపనిలో ఆయన ఉన్నారు. మరొకరు మేకపాటి గౌతమ్ రెడ్డి. ఈయన మేకపాటి కుటుంబం నుండి రాజామోహన్ రెడ్డి వారసుడు. ఆయనకు 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి గౌతమ్ రెడ్డి జగన్ కి అత్యంత ప్రీతిపాత్రుడు. సో… ఈ సామాజికవర్గంలో మార్పులు లేవు. ఒకవేళ ఉన్నా… ఆల్రెడీ ఇదే సామజిక వర్గం నుండి రోజా కంటే సీనియర్లు మంత్రి పదవి కోసం సాసుకుని కూర్చున్నారు. ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి (కాకినాడ).., ఆళ్ళ రామకృష్ణారెడ్డి (మంగళగిరి).., బాలనాగిరెడ్డి (మంత్రాలయం).., శిల్పా చక్రపాణిరెడ్డి (శ్రీశైలం).., కేతిరెడ్డి సోదరులు (అనంతపురం జిల్లా).., చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (చంద్రగిరి).., భూమన కరుణాకర్ రెడ్డి (తిరుపతి) ఇలా చాలా మంది సీనియర్లు రోజా కంటే ముందే పోటీలో ఉన్నారు.
* రోజాకు సొంత జిల్లా నుండి అధికంగా పోటీ ఉంది. అదే జిల్లాకు, అదే సామాజికవర్గానికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరూ జగన్ తో సన్నిహితంగా ఉంటున్నారు. ఈ ఇద్దరికీ కాదని రోజాకు మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు లేవు. ఒకవేళ ఇవ్వాలన్నా.., పెద్దిరెడ్డిని తొలగించి ఇవ్వాలి. చిత్తూరు జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు పెద్దిరెడ్డి చేతిలో ఉంటాయి. ఆయనను కాదని రోజాకు ఇచ్చే అవకాశాలే లేవు. ఒకవేళ పెద్దిరెడ్డిని తొలగించాలన్న.. ఆయన సూచించే వారికే ఇచ్చే అవకాశాలున్నట్టు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
మరి ఏం చేస్తారు..!?
మంత్రి పదవి అవకాశాలు లేవు.. ఏపీఐఐసీ పీకేశారు.. అంటే రోజాకు ఏం పదవి లేకుండానే మూడేళ్లు గడిపేయాలా..!? అనే అనుమానాలు రావచ్చు. పైన పేర్కొన్న క్లిష్ట అవకాశాలు సరళం చేసుకుని ఆమెకు మంత్రి పదవి ఇస్తే ఇవ్వాలి.. జగన్ అంత రిస్క్ చేయబోరు.. ఇక టీటీడీ బోర్డు సభ్యురాలిగా రోజా పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇదే జిల్లా నుండి గతంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసారు. ఇప్పుడు ఆయన స్థానంలో రోజాకు అవకాశం ఇస్తారని ఒక అంచనా..!!