అమరావతి: తెలుగుదేశం పార్టీకి మరో నాయకుడు షాక్ ఇచ్చారు. గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ అన్నం సతీష్ బుధవారం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసనమండలి చైర్పర్సన్కు పంపించారు. టిడిపి సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు తెలిసింది. 25ఏళ్లుగా టిడిపిలో ఆదరించిన ప్రోత్సహించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సతీష్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆత్మప్రభోదానుసారం రాజీనామా చేస్తున్నట్లు సతీష్ పేర్కొన్నారు.
గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న అన్నం సతీష్ 2014లో కోన రఘుపతి చేతిలో ఓటమి పాలయ్యారు. దానితో పార్టీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అన్నం సతీష్ రాజీనామా వార్త ప్రస్తుతం గుంటూరు జిల్లాలో, పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయింది. ఆయన ఏ పార్టీలో చేరనున్నారో ఇంకా తెలియరాలేదు.
ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, గుంటూరు నగర టిడిపి అధ్యక్షుడు చందు సాంబశివరావులు నిన్ననే పార్టీకి రాజీనామా చేయగా బుధవారం ఎమ్మెల్సీ సతీష్ పార్టీకి గుడ్బై చెప్పడం గుంటూరు జిల్లా పార్టీ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది